అధికారుల కృషి ఫలించింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమైక్యవాదులు పచ్చజెండా ఊపడంతో ఎట్టకేలకు బుధవారం నుంచి రాయలసీమ
‘సెట్’ చేశారు
Aug 22 2013 3:14 AM | Updated on Sep 1 2017 9:59 PM
కర్నూలు(విద్య), న్యూస్లైన్: అధికారుల కృషి ఫలించింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమైక్యవాదులు పచ్చజెండా ఊపడంతో ఎట్టకేలకు బుధవారం నుంచి రాయలసీమ యూనివర్సిటీలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఆర్యూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కృష్ణానాయక్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్, సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సంజీవరావు, జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాష్, డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్ తదితరులు ఉద్యోగులతో చర్చలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన వెలువడే వరకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఒప్పుకునేది లేదని రాయలసీమ యూనివర్సిటీ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ శ్రీనివాసరావు, ఇస్మాయిల్, సుంకన్న, మద్దయ్య, రవిశంకర్, రామకృష్ణ, సుబ్బరామయ్య తదితరులు వారికి తేల్చి చెప్పారు.
యూనివర్సిటీలో ఆరు నెలలుగా నీటి సమస్య ఉందని, దీనిని పరిష్కరించేందుకు ఏనాడూ రాని అధికారులు ఇప్పుడెలా వచ్చారంటూ విద్యార్థి జేఏసీ నాయకులు సుబ్బరామయ్య, విజయభాస్కర్, బడేసాహెబ్ ప్రశ్నించారు. సీమాంధ్రలో అన్ని యూనివర్సిటీల్లో కౌన్సెలింగ్ జరుగుతోందని, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరినా ఫలితం లేకపోయింది. దీంతో మొదట అధికారులు కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా.. విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు రెండో దఫా చర్చలు ప్రారంభించారు. కౌన్సెలింగ్ వాయిదా పడటం వల్ల విద్యార్థులకు జరిగే నష్టాలను అధికారులతో పాటు బీసీ,
ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ.. జేఏసీ నాయకులకు వివరించారు. ఎట్టకేలకు జేఏసీ నాయకులు సమ్మతించడంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రాత్రి వరకు చేపట్టిన ప్రక్రియలో 138 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిం చారు. గురువారం నుంచి నిరంతరాయంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కోఆర్డినేటర్ సంజీవరావు తెలిపారు. జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు కాగా.. కర్నూలు, నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ కారణంగా ఆర్యూపై అధిక భారం పడుతున్న దృష్ట్యా విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
Advertisement
Advertisement