కరువు కోరల్లో ప్రకాశం
54 కరువు మండలాలుగా ప్రకటన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ ఏడాది సాదారణ వర్షపాతం కన్నా ప్రకాశం జిల్లాలో 46 శాతం వర్షపాతం తక్కువ నమోదు అయ్యింది. ఇది రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన. ఈ నేపథ్యంలో జిల్లాలో 56 మండలాలకు గాను 54 మండలాలను కరువు మండలాలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఎఆర్ సుకుమార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 224 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే జిల్లాలో రెండు మినహా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ నివేదిక పంపించారు. అయితే ఉలవపాడు, యద్దనపూడి మండలాలు మినహా అన్ని మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, సంతనూతలపాడు, అద్దంకి, కొరిశపాడు, జె పంగలూరు, బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు, చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, కందుకూరు, గుడ్లూరు, వలివేటివారిపాలెం, పొన్నలూరు, కొండేపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, లింగసముద్రం, కనిగిరి, హనుమంతునిపాడు, పామూరు, వెలిగండ్ల, సీఎస్పురం, పీసీపల్లి, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ, కురిచేడు, తర్లుపాడు, మార్కాపురం, దోర్నాల, పెదారవీడు, వైపాలెం, త్రిపూరాంతకం, పుల్లలచెరువు, గిద్దలూరు, రాచర్ల, కొమరవోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది.
ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో ఖరీఫ్ ఆలస్యం అయ్యింది. ఖరీఫ్ సీజన్లో వరి కేవలం 53 శాతంలో పడిందని అధికారులు ప్రకటించారు. జూన్ నెలలో 80 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఒక మాదిరిగా వర్షపాతం నమోదు అయ్యింది. తొమ్మిది శాతం మాత్రమే సాదారణ వర్షపాతం కన్నా తక్కువ నమోదు అయ్యింది. ఆగస్టులో 54 శాతం, సెప్టెంబర్లో 44 శాతం వర్షపాతం తక్కువ నమోదు కాగా, ఆక్టోబర్లో 88 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.