సంక్రాంతి పోరుకు పొరుగు పుంజులు
ఒక్కొక్కటీ రూ.5 వేల నుంచి రూ.10 వేలు
‘పశ్చిమ’లో జోరుగా సాగుతున్న కొనుగోళ్లు
ఆకివీడు: సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో పందెంకోళ్లకు డిమాండ్ పెరిగింది. ఇతర జిల్లాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పందెం కోళ్లను తీసుకువచ్చి జిల్లాలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నారు. కోడి పందాలకు ప్రసిద్ధి గాంచిన పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, జువ్వలపాలెం, పెద అమిరం, మహదేవపట్నం, తదితర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన పందెంకోళ్లను విక్రయిస్తున్నారు.
కోడి ఒక్కింటికి రూ.5 వేలు నుండి రూ.10 వేల వరకూ ధర పలుకుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పెంచే పందెం కోళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల కోడి పుంజుల్ని పందెంరాయుళ్లు బాగానే కొనుగోలు చేస్తున్నారు. తనిఖీల్లో కనపడకుండా పలుచటి గోనె సంచుల్లో కోడి పుంజుల్ని ఉంచి రవాణా చేస్తున్నారు. తమ రాష్ట్రంలో కోడి పుంజులకు అంతగా డిమాండ్ లేదని, అందువల్ల ఇక్కడ విక్రయిస్తున్నామని తమిళనాడుకు చెందిన ఓ విక్రయదారుడు తెలిపాడు.