దానాల్లోకెల్లా శరీరదానం కూడా మహోన్నతమైనదని ఆదివారం జరిగిన ఓ సంఘటన నిరూపించింది. స్థానిక బసిరెడ్డి కృష్ణారెడ్డి (92) మృతదేహాన్ని ఆయన తనయుడు ఆదివారం రిమ్స్కు అప్పగించారు.
కడప అర్బన్, న్యూస్లైన్: దానాల్లోకెల్లా శరీరదానం కూడా మహోన్నతమైనదని ఆదివారం జరిగిన ఓ సంఘటన నిరూపించింది. స్థానిక బసిరెడ్డి కృష్ణారెడ్డి (92) మృతదేహాన్ని ఆయన తనయుడు ఆదివారం రిమ్స్కు అప్పగించారు. విశాఖపట్టణానికి చెందిన సావిత్రిభాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పారు.
మహానేత వైఎస్ జిల్లా ప్రజలకు అందించిన రిమ్స్లో వైద్య విద్యార్థుల పరిశోధనార్థం తమ శరీరాలను దానంగా ఇవ్వాలని కొం దరు సంకల్పించారు. ఇందులోభాగంగా రాయచోటి పరిధిలోని మడితాడు చెరువుకిందపల్లెకు చెందిన బసిరెడ్డి కృష్ణారెడ్డి కుమారుడు బసిరెడ్డిగారి రామ్మోహన్రెడ్డి, కోడలు తులసి ఆంధ్రప్రదేశ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో రిమ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ మరణానంతరం రిమ్స్కు తమ శరీరాన్ని దానంగా ఇస్తామని ఒప్పుకున్నారు.
కృష్ణారెడ్డి (92) కడపలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న జయపద్మ అపార్టుమెంటులో తన కుమారుడు, కోడలు వద్ద ఉంటూ ఆదివారం సహజ మరణం చెందారు. తాము మాట ఇచ్చిన ప్రకారం బసిరెడ్డి కృష్ణారెడ్డి మృతదేహాన్ని వారు రిమ్స్ అధికారులకు అప్పగించి తమ మహోన్నత గుణాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన స్నేహ ఫౌండేషన్ వారు కృష్ణారెడ్డికి సంబంధించిన రెండుకళ్లను రిమ్స్ అధికారుల సిఫార్సు మేరకు తీసుకెళ్లారు.