అలా అయితేనే ప్రైవేటు కాలేజీలకు అనుమతి.. | CM YS Jagan Review Meeting About Government Schools And Colleges | Sakshi
Sakshi News home page

నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో కనీస వసతుల కల్పన: జగన్‌: జగన్‌

Sep 11 2019 5:50 PM | Updated on Sep 11 2019 7:15 PM

CM YS Jagan Review Meeting About Government Schools And Colleges - Sakshi

సాక్షి, అమరావతి: నాడు-నేడు కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో 44,512 ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండాలనికి ఓ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఉండాలని.. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమ పద్ధతిలో జూనియర్‌ కాలేజీ స్థాయికి తీసుకువెళ్లాలని.. అందుకు ఎక్కడెక్కడ.. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఏ ప్రాంతాల్లో చేయాలన్న దానిపై ఒక ప్లాన్‌ సిద్ధం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

నాడు-నేడు కార్యక్రమం మొదటివిడతలో భాగంగా 15,410 పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులు కల్పించనున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. స్కూళ్లలో చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని.. దాంట్లో రాజీపడవద్దని సీఎం అధికారులకు సూచించారు. మార్చి 14, 2020 నాటికి నాడు-నేడు కింద తొలిదశ పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. స్కూళ్ల బాగు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన వారిలో కలిగించాలని సీఎం పేర్కొన్నారు. స్కూళ్లను బాగు చేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు.

వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మాధ్యమంలో బోధన
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన.. ఆ తర్వాత 9,10 తరగతులకు ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రవేశపెట్టనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఈ మేరకు 70 వేల మంది టీచర్లకు ఇంగ్లీషు మీడియం బోధనలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డైట్స్‌ను బలోపేతం చేసి అక్కడ కూడా ఇంగ్లీషులో బోధన ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయమని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది జనవరిలో ఖాళీల భర్తీని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఏ శాఖ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలోనే నిర్వహించాలని సీఎం సూచించారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు చేర్చాలన్నారు. వచ్చే ఏడాది నుంచి పుస్తకాలు, యూనిఫారమ్స్‌, షూ, స్కూలు బ్యాగ్‌ వంటివన్ని పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే అందించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.

అలా అయితేనే ప్రైవేటు కాలేజీలకు అనుమతి
ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది పూర్తిగా అవాస్తవం అన్నారు సీఎం జగన్‌. అయితే సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా.. లేవా అన్నది పరిశీలించాకే అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లల్లో కూడా సరైన సదుపాయాలు ఉండాలని సీఎం ఆదేశించారు. కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా సంస్థ అయినా ఉండటం సరి కాదన్నారు. మధ్యాహ్న భోజనంలో ఇస్తోన్న కోడిగుడ్ల గురించి గతంలో బాగా నెగటీవ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని.. అందుకే తమ ప్రభుత్వం వచ్చాక గుడ్ల పంపిణీని వికేంద్రీకరించామని సీఎం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన గుడ్లు అందేలా ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై మరిన్ని ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement