అమ్మ నాన్నను చూసిన విధానమే ఈ పుస్తకం: సీఎం జగన్
"నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకావిష్కరణ
సాక్షి, ఇడుపులపాయ: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ.. నాన్నను చూసిన విధంగా.."నాలో.. నాతో వైఎస్ఆర్'' రచన చేశారు. గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన వ్యక్తి వైఎస్సార్. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారు. ఇది ఒక మంచి పుస్తకం’అని పేర్కొన్నారు.
(చదవండి: ఎన్నటికీ మరువం రాజన్న!)
వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘నాకు వైఎస్సార్లో ఉన్న మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకు ఇచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలకు వైఎస్సార్ వెలుగు ఇచ్చారు. ఆ వెలుగును నేను చూశాను. ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన. వైఎస్సార్ పిలుపు ఒక భరోసా, ఆయన మాట విశ్వసనీయతకు మారు పేరు. ఆయన మాట, సంతకం ఎన్నో జీవితాలను నిలబెట్టింది. వైఎస్సార్ జీవితం నుంచి నేను, నాపిల్లలు చాలా నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరు వైఎస్సార్ జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఆయన స్ఫూర్తిని అందరు పాటించాలని కోరుతున్నా’ అని విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్సార్ అందరికీ ఒక స్ఫూర్తి అని వైఎస్ షర్మిల అన్నారు. "నాలో.. నాతో వైఎస్సార్'' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు.
(స్నేహ పరిమళాలకు చిహ్నం)