పలు జిల్లాల కలెక్టర్లతోపాటు కొంతమంది ఐఏఎస్ అధికారులకు త్వరలో స్థానచలనం కలగనుంది.
- ప్రద్యుమ్న, కార్తికేయ మిశ్రాకు జిల్లా కలెక్టర్ల కొలువులు..
- కసరత్తు చేస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: పలు జిల్లాల కలెక్టర్లతోపాటు కొంతమంది ఐఏఎస్ అధికారులకు త్వరలో స్థానచలనం కలగనుంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రద్యుమ్నను, పరిశ్రమలశాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న కార్తికేయ మిశ్రాను జిల్లాల కలెక్టర్లగా నియమించనున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. ఐఏఎస్ల బదిలీలపై సీఎం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కలెక్టర్లుగా రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ముఖ్య నేత భావిస్తున్నారని, అయితే అది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో తెలియదని, ఎందుకంటే చిన్న నేత కసరత్తు కూడా కొనసాగుతోందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతుండడం గమనార్హం.
కాగా, గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న కాంతిలాల్ దండేను బదిలీ చేయనున్నట్టు సమాచారం. ఆయన్ను ఏదైనా శాఖ అధిపతిగా నియమించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రద్యుమ్న గుంటూరు జిల్లా కలెక్టర్గా వెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు చినబాబుకు అత్యంత సన్నిహితుడైన పరిశ్రమలశాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రాను జిల్లా కలెక్టర్గా పంపించాలని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఎ.బాబును కూడా బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. బాబును ఐటీ శాఖ కార్యదర్శిగా నియమించే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్మోహన్కు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్కుమార్కు స్థానచలనం కలగనుంది. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కన్న బాబును సీఎం కార్యాలయానికి తీసుకొస్తారని, అలాగే విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ వైస్చైర్మన్గా పనిచేస్తున్న బాబూరావు నాయుడును ఏదైనా జిల్లాకు కలెక్టర్గా నియమించే వీలుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.