నోట్లున్నోడిదే.. మార్కెట్టు | chandrababu naidu said gives positions to all tdp leaders | Sakshi
Sakshi News home page

నోట్లున్నోడిదే.. మార్కెట్టు

Jul 19 2014 4:02 AM | Updated on Aug 10 2018 8:08 PM

నోట్లున్నోడిదే.. మార్కెట్టు - Sakshi

నోట్లున్నోడిదే.. మార్కెట్టు

మార్కెట్ కమిటీల్లో కొలువు దీరడానికి తెలుగు తమ్ముళ్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్నింటి కాలపరిమితి ముగియగా.. మరికొన్నింటిని రద్దుచేసి తమకు కొత్తగా బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తున్నారు.

అధికారం చేతిలో ఉంది..అనుయాయులను అందలం ఎక్కించి అందినంత దండుకుందామనే యోచనలో అధికార పార్టీ నేతలున్నారు. మార్కెట్ కమిటీల పాలకవర్గాలను రద్దు చేసి..వాటి పగ్గాలను తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు దేశం నేతలు ప్రయత్నిస్తున్నారు. పదవులిచ్చేందుకు వసూళ్ల పర్వానికీ తెరతీశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
 
సాక్షి, ఒంగోలు: మార్కెట్ కమిటీల్లో కొలువు దీరడానికి తెలుగు తమ్ముళ్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్నింటి కాలపరిమితి ముగియగా.. మరికొన్నింటిని రద్దుచేసి తమకు కొత్తగా బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తున్నారు. లాభసాటి వ్యవసాయం అందివ్వడం ఏమోగానీ.. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని లాభం పొందాలనే ఎత్తుగడతో జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తాపత్రయపడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
 
కొత్తప్రభుత్వం ఏర్పాటుతో మార్కెట్ కమిటీల పాత పాలకవర్గాలను రద్దుచేస్తూ ఉత్తర్వులివ్వడం పాతపద్ధతేనని టీడీపీ చెప్పుకుంటోంది. సందట్లో సడేమియా అంటూ ఇప్పటికే జిల్లాలో కొందరు దళారీల అవతారమెత్తి శాసనసభ్యులు, మంత్రుల చుట్టూ తిరుగుతూ సిఫార్సులు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గంలో పేరు కనబడాలంటే, సొమ్ము ముట్టచెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి.
 
ద్వితీయ శ్రేణివర్గం గుర్రు..  
జిల్లాలో మొత్తం 15 మార్కెట్ కమిటీలున్నాయి. 12 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఉండగా.. మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి నియోజకవర్గాల్లో అదనంగా మరొకటి చొప్పున ఏర్పాటయ్యాయి. ఇందులో కంభం, మినహా మిగిలిన అన్నిచోట్ల పాలకవర్గాలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయి. వీరిలో చాలామంది ఏడాది కూడా పదవుల్ని అనుభవించలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. హస్తం కుదేలవడంతో అందులోని కొందరు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరగా, మరికొందరు టీడీపీలోకి వెళ్లారు. అద్దంకి, మార్టూరు కమిటీల కాలపరిమితి ఇప్పటికే ముగిసింది.
 
ఇంకా ఒంగోలు, మద్దిపాడు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, పర్చూరు, చీరాల, దర్శి, పొదిలి, కనిగిరి, కంభం, వై.పాలెం మార్కెట్ కమిటీలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ఈ 13 చోట్ల పాలకవర్గాలు రద్దుకానున్నాయి. టీడీపీలో కష్టపడ్డ కార్యకర్తలకు పదవులిస్తామని ఇప్పటికే చంద్రబాబు వేదికలపై ప్రకటించగా, ఆయన మాటలను అడ్డంపెట్టుకుని కొందరు జిల్లాలో పదవులిప్పిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని ద్వితీయశ్రేణి నేతలు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు పంపారు.

జిల్లాలో కొందరు నేతల మధ్య కొనసాగుతోన్న ఆధిపత్యపోరు కూడా దళారీ వ్యవస్థను ప్రోత్సహించినట్టవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నవారు సైతం మరోసారి మార్కెట్ కమిటీలకు ఎంపిక కావాలంటే పార్టీలో ఇప్పటికే ఉన్న సీనియర్‌ల నుంచి పోటీ ఎదుర్కోవాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement