మాటల బడ్జెట్ | budget have been juggling with words | Sakshi
Sakshi News home page

మాటల బడ్జెట్

Mar 13 2015 12:59 AM | Updated on Oct 2 2018 4:53 PM

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాటల గారడీ చేశారు. శాసనసభలో గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు రాజధాని స్థాయిలో నిధులు కేటాయించలేదు.

ఆశాజనకం

బందరులో మెరైన్ అకాడమీ ఏర్పాటు  
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పోర్టు అభివృద్ధి
గన్నవరం విమానాశ్రయ విస్తరణ    
కూచిపూడిలో నాట్యారామం ఏర్పాటు
పర్యాటక కేంద్రంగా భవానీ ద్వీపం 
స్మార్ట్ సిటీగా విజయవాడ అభివృద్ధి

 ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులే.. ఎప్పటికి పూర్తయ్యేదీ ప్రశ్నార్థకమే..
 
నిరాశాజనకం

బందరు పోర్టుకు కేవలం రూ.30 లక్షల కేటాయింపు
రైతు రుణమాఫీ దశలవారీగానే..
డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు

 
విజయవాడ : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాటల గారడీ చేశారు. శాసనసభలో గురువారం ప్రవేశ  పెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు రాజధాని స్థాయిలో నిధులు కేటాయించలేదు. ప్రతి పాదిత అంశాలు 20కి పైగా ఉండగా కొన్నింటిని మాత్రమే మంజూరు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. బందరు పోర్టుకు  కేవలం రూ. 30 లక్షలు కేటాయించి జిల్లావాసుల ఆశలపై నీళ్లు చల్లారు. రుణమాఫీ దశలవారీగా జరుగుతుందని చెప్పి రైతుల  ఆశలను ఆవిరి చేశారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ ఊసే బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం శోచనీయం. బడ్జెట్‌పై వివిధ పార్టీల నేతలు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు.
 
రాజధాని నిర్మాణానికి రూ.3,168 కోట్లు


నూతన రాజధాని నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.3,168 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. మచిలీపట్నం పోర్టును ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని, గన్నవరం విమానాశ్రయం విస్తరణ చేపడతామని ప్రకటించారు. కూచిపూడిలో నాట్యారామం ఏర్పాటుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. హస్తకళల అభివృద్ధి కోసం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుచేస్తామని తెలిపారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వ బీసీ బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. జిల్లాలో మరో బీసీ స్టడీ సర్కిల్ ఏరా్పాటు చేస్తామన్నారు. మైలవరంలో నీటిపారుదల కోసం రూ.5.90 కోట్ల నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. అయితే ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు కావటంతో వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంది. నూతన రాజధాని విజయవాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో డ్వాక్రా రుణమాఫీ ప్రస్తావనే లేకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో మాఫీ కావాల్సిన డ్వాక్రా రుణాలు రూ.300 కోట్లు ఉండగా, జిల్లాలో రూ.918 కోట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనా లేకపోవటంపై రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
కృష్ణా డెల్టా ఆధునికీకరణకు  రూ.111.08 కోట్లు

కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.111.08 కోట్లను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.120.14 కోట్లు కేటాయించగా, రాష్ట్ర విభజన తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో కృష్ణాడెల్టా పనులకు కోత పెట్టారు. పులిచింతల ప్రాజెక్టు (కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టు)కు బడ్జెట్‌లో రూ.20.11 కోట్లు, ప్రకాశం బ్యారేజీ అభివృద్ధి పనులకు రూ.55 లక్షలు, జిల్లాలో ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5.80 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement