అవకాశమిచ్చినా అందిపుచ్చుకోరా..

BPS Scheme Not Been Able To  Running Properly in Vizianagaram  - Sakshi

రెండోసారి బీపీఎస్‌ గడువు పెంచిన ప్రభుత్వం

ఇప్పటివరకు పరిష్కారమైనవి 93 దరఖాస్తులు

సాక్షి, విజయనగరం : పట్టణ ప్రాంతాల్లో అక్రమ భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం బీపీఎస్‌ పథకం ద్వారా మంచి అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకునేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బీపీఎస్‌ను (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌) అమలు చేస్తున్న అనుకున్నవిధంగా స్పందన రాలేదు. 

జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో అక్రమ భవనాలు ఉన్నాయన్న విషయం బహిరంగ సత్యమైనా.. వాటిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో యజ మానులు సైతం నిర్లక్ష్యం నటిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో మున్సిపల్, కార్పొరేషన్‌ల ఖజా నాకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.

 అక్రమ భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న  బీపీఎస్‌ గడువును మరో మారు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు జూలై నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ పథకం ప్రారంభించగా... ఏప్రిల్‌ 6వ తేదీ వరకు గడువిచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో రెండు నెలల పాటు జూన్‌ నెలాఖరు వరకు గడువు పెంచింది. అయినప్పటికీ అక్రమభవనాల యజమానుల్లో స్పందన లేకపోవడంతో మరో నెల రోజుల గడువు పెంచుతూ జూలై నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. దీంతో గడిచిన ఐదు నెలల వ్యవధిలో ఇప్పటివరకు రెండు సార్లు గడువు పెంచినట్‌లైంది.  

 అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు అమలు చేస్తోన్న బీపీఎస్‌ స్కీమ్‌కు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. 1985 జనవరి 1వ తేదీ నుంచి 2018 ఆగస్టు 31 వరకు వాస్తవ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టినా.. అసలు అనుమతులే పొందకుండా నిర్మించిన అక్రమ కట్టడాలకు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించింది. అనుమతిలేని లే అవుట్‌లలో నిర్మాణం జరిగిన భవనాలను కూడా క్రమబద్ధీకరణ చేసుకోవచ్ఛు. అనధికార భవన నిర్మాణదారులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.10 వేలు చొప్పున చెల్లించాలి. ఆ తర్వాత సంబంధిత అధికారులు భవనాలను పరిశీలించి ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులకు భిన్నంగా నిర్మించిన భవనాలను గుర్తించి అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా తాఖీదులు ఇస్తారు. అందుకు సంబంధించిన అన్ని రికార్డులను ఆన్‌లైన్‌లోనే పొందుపరచాలి. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే క్రమబద్ధీకరిస్తూ అనుమతులిస్తారు.

అయితే ఈ పథకం కింద జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల నుంచి మొత్తంగా 1126 దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి 876 దరఖాస్తులు నమోదుకాగా... బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి 88, పార్వతీపురం మున్సిపాలిటీ నుంచి 89, సాలూరు మున్సిపాలిటీ నుంచి 73 దరఖాస్తులు వచ్చాయి. నాలుగు పట్టణాల్లో వాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రతి మున్సిపాలిటీలో వందల సంఖ్యలోనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలున్నాయి. అయితే ఆయా భవనాల యజమానులకు రాజకీయ అండదండలు, ఆర్థిక బలం ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సాహసించడం లేదు. అంతేకాకుండా కొందరు అధికారులు, ఉద్యోగులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

 ఇబ్బందులు తప్పవు..
 జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అక్రమ భవన నిర్మాణాల బాగోతం కనిపిస్తోంది. భవనాలను క్రమద్ధీకరించుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు తొలగించడంతో పాటు క్ర య, విక్రయాలు జరపకుండా నిషేధం విధిస్తారు. మరీ తప్పనిసరి పరిస్థితులైతే ఆయా భవనాలను నేలమట్టం చేసే అవకాశం కూడా ఉంది. 

గడువు పెంపు..
పట్టణాల్లో అనధికార భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తుదారులు ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌ చేసుకోవాలి.  అక్రమంగా భవనాలు నిర్మించిన వాటిని గుర్తించి ఇప్పటికే నోటీసులు జారీ చేయటంతో పాటు వారికి అవగాహన కల్పిస్తున్నాం. క్రమబద్ధీకరణ చేసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు.  
–  వి.శోభన్‌బాబు, కె.హరిదాసు, సిటీ ప్లానర్లు, 
విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌

పరిష్కారంలో జాప్యం..
బీపీఎస్‌లో మొత్తం నాలుగు పట్టణాల నుంచి 1126 దరఖాస్తులు నమోదుకాగా..అందులో 93 దరఖాస్తులను పరిష్కరించి భవనాలను క్రమబద్ధీకరించారు. ఇందులో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో  40, సాలూరు మున్సిపాలిటీలో 22, బొబ్బిలి మున్సిపాలిటీలో 31 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 3 దరఖాస్తులను తిరస్కరించారు. నాలుగు పట్టణాల్లో మరో 719 దరఖాస్తులు ఇప్పటికీ అధికారుల పరిశీలనలో ఉన్నాయి. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 117 దరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అధికారుల పరిశీలన అనంతరం అపరాధ రుసుం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసిన దరఖాస్తులు మరో 186 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top