రెవెన్యూ వ్యవస్థలో ధ్రువీకరణ పత్రాలు జారీలో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
టెక్కలి: రెవెన్యూ వ్యవస్థలో ధ్రువీకరణ పత్రాలు జారీలో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇకపై రెవెన్యూ శాఖ నుంచి వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి తహశీల్దార్ల వేలిముద్రలతో ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 38 మండలాలకు చెందిన తహశీల్దార్ల వేలిముద్రలు, ఆధార్ కార్డు పత్రాలను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. అక్టోబర్ ఒకటి నుంచి ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు.
ప్రస్తుతం ధ్రువీకరణ పత్రాల జారీ ఇలా..!
ప్రస్తుతం రెవెన్యూ విభాగం ద్వారా సుమారు 64 రకాల సేవలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుత విధానంలో ఏదైనా ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న తరువాత తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ తహశీల్దార్ డిజిటల్ కీ సంతకంతో మరళా మీసేవ కేంద్రం నుంచి ప్రజలకు అందుతాయి. ఈ విధానంలో కొన్నిసార్లు తహశీల్దార్ల ప్రమేయం లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ల నేరుగా డిజిటల్ కీ సంతకాలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నూతన విధానంలో....
బయోమెట్రిక్ విధానంలో మీసేవ కేంద్రం నుంచి ఆన్లైన్ ద్వారా వచ్చిన ధ్రువీకరణ పత్రాలను తహశీల్దార్లు పర్యవేక్షిస్తారు. తరువాత నేరుగా బయోమెట్రిక్ పరికరంతో వేలిముద్రలు వేసి, అక్కడ నుంచి మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తారు. బయోమెట్రిక్ విధానం వల్ల ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. ఈ ప్రక్రియ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. తహశీల్దార్లు కార్యాలయాల్లో లేని సమయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పవేమెనని పలువురు అభిప్రాయ పడుతున్నారు.