నేటినుంచి బీదర్-యశ్వంత్‌పూర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ | bidar-yaswanthpur weekly express starts from today onwards | Sakshi
Sakshi News home page

నేటినుంచి బీదర్-యశ్వంత్‌పూర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్

Sep 1 2013 12:53 AM | Updated on Mar 28 2018 10:56 AM

రంగారెడ్డి, మెదక్, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, యాద్‌గిర్, రాయచూర్ జిల్లావాసులకు నేటినుంచి కొత్త రైలు అందుబాటులోకి రానుంది.

 తాండూరు, న్యూస్‌లైన్: రంగారెడ్డి, మెదక్, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, యాద్‌గిర్, రాయచూర్ జిల్లావాసులకు నేటినుంచి కొత్త రైలు అందుబాటులోకి రానుంది. బీదర్ - యశ్వంత్‌పూర్ (రైలు నంబర్ 16572/16571) ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఆదివారం ఉదయం బీదర్‌లో రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే లాంఛనంగా ప్రారంభించనున్నట్టు రైల్వే వర్గాల సమాచారం. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా వారంలో మూడు రోజులు నడవనున్నది. జిల్లాకు సంబంధించి వికారాబాద్‌లో ఈ రైలుకు హాల్టింగ్ కల్పించారు.  బీదర్ - యశ్వంతపూర్ (నం.16572) రైలు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, యశ్వంతపూర్ - బీదర్ (నం.16571) రైలు ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో నడుస్తుంది. ఆయా రోజుల్లో బీదర్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు ఈ రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుకుంటుం ది. అదేవిధంగా యశ్వం త్‌పూర్ నుంచి రాత్రి 7.15గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30గంటలకు బీదర్‌కు చేరుకుంటుంది.
 
 వికారాబాద్‌కు చేరుకునే సమయం
 బీదర్ నుంచి వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆయా వారాల్లో రాత్రి 8.30గంటలకు, యశ్వంత్‌పూర్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 7.27 గంటలకు వికారాబాద్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ 5 నిమిషాలు ఆగనుంది.
 
 తాండూరుకు మొండిచేయి..
 అయితే జిల్లాలోనే ప్రధాన వ్యాపారకేంద్రమైన తాండూరు రైల్వేస్టేషన్‌లో మాత్రం ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. రోజుకు సుమారు రూ.2లక్షల ఆదాయం వచ్చే తాండూరు రైల్వేస్టేషన్‌లో ఈ కొత్త రైలుకు హాల్టింగ్ కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరు రైల్వేస్టేషన్‌లో ఈ రైలును ఆపితే బెంగళూరు, కర్నూలు నుంచి నాపరాతి, సిమెంట్ ఉత్పత్తుల వ్యాపార లావాదేవీల కోసం రాకపోకలు సాగించే వ్యాపారులకు వెసులుబాటుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సాయంత్రం 3.30గంటలకు తాండూరు నుంచి బెంగళూరుకు లింక్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ రైలు బెంగళూరుకు మరుసటి రోజు ఉదయం 6.30గంటలకు చేరుకుంటుంది.
 
  ప్రయాణానికి సుమారు 15గంటలు పడుతోంది. అదే బీదర్ -యశ్వంత్‌పూర్ రైలుకు తాండూరులో హాల్టింగ్ ఇస్తే వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 8.30గంటలకు బయలుదేరి సుమారు రాత్రి 9.10గంటలకు ఇక్కడికి వ స్తుంది. ఇక్కడి నుంచి యశ్వంత్‌పూర్‌కు ఉదయం 7.40గంటలకు చేరుకుంటుంది. తద్వారా తాండూరు నుంచి 10.30గంటల ప్రయాణం పడుతుంది. దీంతో సుమారు 5గంటల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న జైపాల్‌రెడ్డి కొత్త రైలుకు తాండూరులో హాల్టింగ్‌కు చొరవచూపాలని వారు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement