
వాడివేడిగా బందరు కౌన్సిల్
మచిలీపట్నం మునిసిపాలిటీ నూతన పాలకవర్గ కౌన్సిల్ తొలి సమావేశం శనివారం వాడీవేడిగా జరిగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మధ్య పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
- రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష సభ్యుల సంవాదం
- సమస్యలపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల ఏకరువు
- కమిషనర్ కారు అద్దె అంశంపై ఖంగుతిన్న అధికారులు
- ఆక్రమణల తొలగింపునకు కౌన్సిల్ నిర్ణయం
మచిలీపట్నం టౌన్ : మచిలీపట్నం మునిసిపాలిటీ నూతన పాలకవర్గ కౌన్సిల్ తొలి సమావేశం శనివారం వాడీవేడిగా జరిగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మధ్య పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, కమిషనర్ కారు అద్దె అంశం, రియల్ ‘దోపిడీ’, కూరగాయల మార్కెట్లో అనుమతులు లేకుండా దుకాణాలను నిర్మించటం, డంపర్బిన్లు, ఆటో రిక్షాలు, ట్యూబ్ లైట్ల సెట్ల కొనుగోలు, పాత ఇనుము అమ్మకం తదితర అంశాలు సభను కుదిపేశాయి. వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ షేక్ అచ్చేబా, కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, లంకా సూరిబాబులు సంధించిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు.
మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలో పేర్కొన్న 23 అంశాలపై చర్చించారు. నాలుగో అంశంపై టీడీపీ సభ్యుడు నారాగాని ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతు, డ్వాక్రా రుణాల మాఫీకి తొలి సంతకం చేశారని, దీంతో ఎంతో మందికి మేలు జరుగుతుందని చెప్పారు. దీనిపై కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ సభ్యుడు అచ్చేబా స్పందిస్తూ.. రుణమాఫీ అని ప్రకటించారేకాని అమలు జరగలేదన్నారు.
మాఫీ అంతా బూటకమేనని విమర్శించారు. సభను పక్కదోవ పట్టించవద్దని చైర్మన్ పేర్కొనటంతో తాము అజెండా అంశంపై మాట్లాడుతుంటే అంజనేయప్రసాదే పక్కదోవ పట్టించాడని, వైస్ పాలనలో పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాల మాదిరిగా ఇచ్చేవారని, ఇప్పుడు ఆలస్యంగా ఇస్తున్నారని చెప్పలేదుగా అని బదులిచ్చారు. చేపల మార్కెట్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి వైఎస్సార్ సీపీ సభ్యుడు మేకల సుబ్బన్న మాట్లాడుతూ.. ఇప్పటికే 3 సీట్ల మరుగుదొడ్లు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలన్నారు.
కౌన్సిల్ అనుమతి లేకుండా మార్కెట్లోని మధ్యగోడను ఎలా తొలగించారని అధికారులను ప్రశ్నించారు. మంత్రి మార్కెట్లో పర్యటించినప్పుడు వార్డు కౌన్సిలర్గా ఉన్న తనను ఎందుకు ఆహ్వానించకుండా వివక్ష చూపారనిని చైర్మన్ను ప్రశ్నించారు. కౌన్సిల్ విప్ కాగిత జవహర్లాల్ మాట్లాడుతూ మునిసిపాలిటీ పరిధిలో ఎంత మంది ఉద్యోగులకు ఇంకా డీఏ బకాయిలు చెల్లించాలో చెప్పాలని కోరారు.
కమిషనర్ ఉపయోగించిన కారుకు 2014 మార్చి నుంచి జూలై నెల వరకూ ఐదు నెలల అద్దె రూ. 24 వేలను సాధారణ నిధులనుంచి చెల్లించేందుకు కౌన్సిల్ అనుమతికోసం ప్రతిపాదించడంపై మేకల సుబ్బన్న అభ్యంతరం తెలిపారు. గత 12 నెలల అద్దెను చెల్లించేందుకు రూ. 2.97 లక్షలతో పెట్టిన బిల్లు ప్రియాంబుల్పై గత పిబ్రవరి 20నే ప్రత్యేక అధికారి సంతకం చేశారని, మళ్లీ ఇప్పుడు ఐదు నెలల బిల్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. పిబ్రవరిలో ప్రత్యేక అధికారి సంతకం పెట్టిన ప్రియాంబుల్ కాపీ నకళ్లనుమ సుబ్బన్న తీసి చూపటంతో కమిషనర్, ఎంఈలు ఖంగుతిని తర్జన భర్జన పడ్డారు.
ఎట్టకేలకు కమిషనర్ మారుదీ దివాకర్ దీనిపై స్పందిస్తూ.. తన కారుకు చార్జి చెల్లించాలని అజెండాలో తప్పుగా పేర్కొన్నామని, వాస్తవానికి ఎన్నికల సమయంలో ఆర్డీవో సాయిబాబు కారును ఉపయోగించారని దానికి అయిన ఖర్చు చెల్లించాలని ప్రతిపాదించామని వివరణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు ప్రతేృ క నిధులు వస్తాయని, సాధారణ నిధుల్లోంచి ఎందుకు చెల్లించాలని అధికార, ప్రతిపక్ష సభ్యులు కమిషనర్ను ప్రశ్నించారు. దీంతో ఈ అంశాన్ని వాయిదా వేశారు.
విజయవాడ రోడ్లోని వేసిన లే అవుట్కు మునిసిపాలిటీ అనుమతులు ఇవ్వగా దాదాపు 2 వేల గజాలకు పైగా స్ధలాన్ని మునిసిపిల్ పార్కుకు అప్పగించారని, ఆ తర్వాత ఈ స్థలాన్ని కొంత మంది తమపేరున రిజిస్టర్ చేసుకుని ప్రహరీ గోడ కట్టారని సుబ్బన్న పేర్కొన్నారు. ఈ స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ ఏ చర్యా తీసుకోలేదన్నారు. రియల్దోపిడీపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం క్లిప్పింగ్ను చూపించారు.
దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆక్రమణలకు గురైన మునిసిపల్ స్థలాలు, పార్కులను కౌన్సిల్ సభ్యులందరం కలిసి గుర్తించి, చర్యలు తీసుకుందామని రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత అచ్చేబా మాట్లాడుతూ టౌన్ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప ప్రతిపక్ష నాయకుడు శీలం బాబ్జీ, వైస్ చైైర్మన్ పి.కాశీవిశ్వనాథం, టీడీపీ కౌన్సిలర్లు పల్లపాటి సుబ్రహ్మణ్యం, బత్తిన దాసు, కొట్టె అంకా వెంకట్రావ్ తదితరులు మాట్లాడారు.