ఆర్టీసీ మరోసారి జూలు విదిల్చింది. జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.2 కోట్ల అదనపు భారాన్ని మోపింది.
ఆర్టీసీ బాదుడుతో ప్రయాణికుల బెంబేలు
పల్లె వెలుగునూ వదలని ప్రభుత్వం
ఖమ్మం, న్యూస్లైన్: ఆర్టీసీ మరోసారి జూలు విదిల్చింది. జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.2 కోట్ల అదనపు భారాన్ని మోపింది. ఏసీ, సూపర్లగ్జరీ, ఎక్స్ప్రెస్ చార్జీలతోపాటు పేద, మధ్య తరగతి వర్గాలు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులను కూడా వదలకుండా చార్జీల మోత మోగిం చింది. జిల్లాలో ఖమ్మం, మధిర, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి డిపోలకు చెందిన 604 బస్సు సర్వీసులు ఉన్నాయి. ఇందులో 274 పల్లెవెలుగు, 223 ఎక్స్ప్రెస్లు, 45 డీలక్స్, 53 సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్లు రోజుకు 2.65 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి.
ఈ బస్సుల ద్వారా రోజుకు సగటున 85 వేల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వరంగల్ తదితర నగరాలకు వేలాది మంది వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఆర్టీసీకి రోజుకు ఏసీ బస్సుల ద్వారా రూ.15 లక్షలు, లగ్జరీలు, సూపర్ లగ్జరీల ద్వారా రూ. 20 లక్షలు, ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగుల ద్వారా రూ. 20 లక్షల మేర ఆదాయం వస్తుంది. అయితే పెరిగిన ధరల ప్రకారం జిల్లా ప్రజలపై రోజుకు రూ. 6.5 లక్షల మేరకు అదనగా భారం పడుతుంది.
ఇలా నెలకు సుమారు రూ. 2 కోట్ల భారం పడనుంది. పేద, మధ్య తరగతి వర్గాల వారు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులపై కూడా 8 శాతం చార్జీలు వడ్డించడంతో ఆ ప్రయాణికులపై రోజుకు రూ. 2 లక్షల మేర భారం పడనుంది. ఏసీ బస్సులపై 12 శాతం, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్లపై 10 శాతం, పల్లెవెలుగు బస్సులపై 8 శాతం అదనంగా చార్జీలు పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పెంచిన చార్జీలు మంగళవారం అర ్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే గ్యాస్, నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీల ధరలు పెరిగి బతుకుబండిని భారంగా లాగుతున్న నిరుపేదలపై బస్సు చార్జీల భారం వేయడం ఏంటని వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. బస్సు చార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఖమ్మం నుంచి ప్రధాన పట్టణాలకు పెరిగిన చార్జీల వివరాలు (రూ.లలో)
పట్టణం పేరు - ఎక్స్ప్రెస్ - డీలక్స్ - సూపర్లగ్జరీ
{పస్తుతం - పెరిగింది - ప్రస్తుతం-పెరిగింది- ప్రస్తుతం-పెరిగింది
------------------------------------------------------------
హైదరాబాద్ 138- 151 153- 170 180- 201
విజయవాడ 90- 98 100- 111 117- 131 వరంగల్ 91- 100 101- 113 119- 133 రాజమండ్రి 159- 174 176- 196 207- 231 కొత్తగూడెం 58- 64 64- 72 76- 84 సత్తుపల్లి 58- 64 64- 72 76- 84 భద్రాచలం 87- 95 96- 107 113- 126 మణుగూరు 105- 115 116- 130 137- 153
ఇల్లెందు 36- 39 40- 44 47- 52
------------------------------------------------------------
నోట్ : ఖమ్మం నుంచి హైదరాబాద్కు ఏసీ(ఇంద్ర) బస్సుకు ప్రస్తుతం రూ. 230 ఉండగా ఇది రూ. 353 కు పెరిగింది.