‘గంటా వల్లే జూనియర్‌ లెక్చరర్లకు అన్యాయం’

AP Junior Lecturers Association Meeting Held In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అవినీతి పనుల వల్ల జూనియర్ లెక్చరర్స్‌కు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్‌ సూర్య నారాయణ ఆరోపించారు. ఏపీ డైరెక్ట్‌ రిక్రూటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె ఆర్‌ సూర్య నారాయణతోపాటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె ఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ప్రమోషన్ల వల్ల డైరెక్ట్ రిక్రూట్ వారికి అన్యాయం జరిగిందని తెలిపారు. అక్రమ ప్రమోషన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

గత ప్రభుత్వంలో జూనియర్‌ లెక్చరర్స్‌ నుంచి ప్రిన్సిపాల్స్‌గా అక్రమంగా ప్రమోషన్స్‌ పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య శాఖలను ప్రక్షాళన చేయాలని భావిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారావు మాట్లాడుతూ శాఖాపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్‌ రిక్రూటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా జూనియర్‌ లెక్చరర్ల ప్రమోషన్స్‌ అవకతవకలు సరిచేస్తామని హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top