
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్కు కేటాయించిన అంబులెన్సుల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. అధికార వర్గాల్లో ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా సీఎంకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలలో నాలుగు అత్యాధునిక అంబులెన్సులను కేటాయించారు. సీఎం ఏ జిల్లాలో పర్యటించినా సమీపంలోని అంబులెన్స్ కాన్వాయ్లో ఉంటుంది. వీటిల్లో జనరల్ మెడిసిన్, అనస్థీషియా, ఆర్థోపెడిక్ డాక్టర్లతోపాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఉంటారు. కాగా, నెలకు రూ.60 వేల వేతనంతో ఇటీవల డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినా ఇద్దరే ముందుకొచ్చారు. సీఎం పర్యటన ఉన్నప్పుడే వైద్యులు పనిచేయాల్సి ఉన్నప్పటికీ ఎవరూ ముందుకురాకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తే వేలల్లో దరఖాస్తులొస్తాయని.. కానీ, సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు ఎందుకు రావడంలేదో అర్థంకావడం లేదని ఓ అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కూడా వీటిల్లో పనిచేసేందుకు సుముఖంగా లేరు. తాము ఆ డ్యూటీకి వెళ్లలేమని చెబుతున్నారు. దీంతో కొత్త అంబులెన్సులకు డాక్టర్లు లేకపోవడంతో వాటిని ప్రారంభించలేదు.