మూడు హత్యల ఘటనలో దొరికిన మరో క్లూ!

మూడు హత్యల ఘటనలో దొరికిన మరో క్లూ! - Sakshi


విజయవాడ: విజయవాడ-ఏలూరు హైవేపై పెద్దవుటపల్లి వద్ద నిన్న జరిగిన మూడు హత్యలకు సంబంధించి మరో క్లూ దొరికింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనాస్థలానికి 5 కిలో మీటర్ల దూరంలో తొట్టిపాడు టోల్గేట్ వద్ద పార్క్ చేసిన పల్సర్ బైకును పోలీసులు కనుగొన్నారు. ఈ పల్సర్ బైకు నెంబరు ఏపి 27 ఏఎస్ 3400. నిన్నటి నుంచి ఆ బైకు అక్కడే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. షూటర్స్కు సమాచారం ఇచ్చేందుకు ఈ బైకును నిందితులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.



 హంతకులు వాడిన కారును కూడా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.   వాళ్లు బస చేసిన రాయల్ హంపీ హోటల్ వెనుక భాగంలోనే వారు వాడిన కారును వదిలి వెళ్లారు. కారులోని  రెండు కత్తులు, తుపాకీతో పాటు రాడ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన తర్వాత వీరంతా  హోటల్కు చేరుకుని, తాపీగా బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది.



ఇదిలా ఉండగా, హత్యకు గురైనవారు ముందుగానే పోలీస్ రక్షణ అడిగినట్లు తెలుస్తోంది. అయితే గన్నవరం నుంచి రక్షణ కల్పించడం సాధ్యంకాదని, ఏలూరు వచ్చిన తరువాత రక్షణ కల్పిస్తామని పోలీసులు వారికి చెప్పినట్లుగా చెబుతున్నారు. పోలీసుల రక్షణ లేకుండా రావడం వల్లే వారు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top