వైఎస్సార్‌ సీపీలోకి రాంబాబు | Anna Rambabu Join In YSRCP Prakasam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి రాంబాబు

Jun 23 2018 1:19 PM | Updated on Aug 20 2018 6:07 PM

Anna Rambabu Join In YSRCP Prakasam - Sakshi

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం  ఆయన మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలులోని ఆయన స్వగృహంలో కలిశారు. ఇరువురు గంటపాటు చర్చలు జరిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల పై సుదీర్ఘ చర్చ సాగింది. రాంబాబుతోపాటు గిద్దలూరు నియోజకవర్గం కొమరోలుకు చెందిన పార్టీ నేతలు  కామూరు రమణారెడ్డి, రామనారాయణరెడ్డి తదితరులు రాంబాబుతో పాటు బాలినేనిని కలిశారు. బాలినేని తో చర్చల అనంతరం రాంబాబు సాయంత్రం ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఆ తరువాత  వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లుఅన్నా రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు.

గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ విజయానికి  కృషి చేస్తానన్నారు. భేషరతుగానే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రాంబాబు పార్టీలో చేరడమే తరువాయి. త్వరలోనే  ముహూర్తం ఖరారు కానుంది. 2009లో గిద్దలూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున అన్నా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తుమల అశోక్‌రెడ్డి ఆ తరువాత టీడీపీలోకి పిరాయించారు.అశోక్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని అన్నా రాంబాబు  తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు వినలేదు. దీంతో రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబుకు గిద్దలూరు, మార్కాపురం, యర్రగొడంపాలెం నియోజకవర్గాల్లో  మంచి పట్టుంది. జిల్లా వ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement