ఉపాధి కోర్సులకు ఊతమేదీ? | Sakshi
Sakshi News home page

ఉపాధి కోర్సులకు ఊతమేదీ?

Published Tue, Aug 11 2015 7:52 PM

andhra pradesh government neglects professional courses

గుంటూరు ఎడ్యుకేషన్: ‘విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలి.. నైపుణ్యాలు లేనిదే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావు. నైపుణ్యాలను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం విశేషకృషి చేస్తోంది..’ ఇవి టీడీపీ ప్రభుత్వం ప్రతి సందర్భంలో వల్లెవేస్తున్న మాటలు. కానీ వాస్తవంలో పాఠశాల స్థాయిలోని వృత్తివిద్య (ఒకేషనల్ ఎడ్యుకేషన్)పై పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తోంది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1984 నుంచి అమల్లో ఉన్న వృత్తివిద్యకు ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ప్రాక్టికల్ మెటీరియల్, సర్వీసింగ్‌కు బడ్జెట్‌ను నిలిపివేసింది. ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల భర్తీ చేయడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు.

విద్యార్థుల్లో చేతివృత్తులపై నైపుణ్యాలను పెంచేందుకు 1984-85లో వృత్తివిద్యా కోర్సులను ప్రవేశపెట్టారు. మొదటి సంవత్సరంలో 60 స్కూళ్లలో 8, 9, 10 తరగతుల్లో విద్యుత్ వైరింగ్, గృహోపకరణాల రిపేరు కోర్సులను ప్రారంభించారు. 1985-86 నుంచి ప్రతి జిల్లాలోను 15 హైస్కూళ్లలో ఒక్కోదాన్లో కుట్టుపని-దుస్తుల తయారీ, తోటల పెంపకం, చేపల పెంపకం, ఆరోగ్యం-సాధారణ చికిత్స, గృ హ విద్యుదీకరణం-గృహ విద్యుత్ యంత్రా లు, రేడియో అండ్ టీవీ మెకానిజమ్, వ్యవసాయ యంత్రాలు, సాధారణ మెకానిజం, కంపోజింగ్-ముద్రణ బ్లాక్‌మేకింగ్, బుక్ బైండింగ్, వడ్రంగం వంటి కోర్సులు ప్రవేశపెట్టారు.

వృత్తివిద్యా కోర్సును ఎంపిక చేసుకున్న విద్యార్థులకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు ఒకేషనల్ పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులకు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రత్యేక సర్టిఫికెట్ ఇస్తోంది. దీని ఆధారంగా 10వ తరగతి పూర్తిచేయగానే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండేవి. దీంతో గ్రా మీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.

కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం
పాఠశాల స్థాయిలో వృత్తివిద్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నాలుగేళ్లుగా ప్రాక్టికల్ మెటీరియల్, సర్వీసింగ్‌కు నిధుల్విడంలేదు. వృత్తివిద్య బోధించే పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లకు దశాబ్దాలుగా సదుపాయాల్లేవు. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు ఉద్యోగ విరమణ చేసిన తరువాత పెన్షన్ సదుపాయం లేదు. 60 ఖాళీలను భర్తీ చేయడం లేదు. వృత్తి విద్య అమల్లో ఉన్న పాఠశాలల్లో టైం టేబుల్ 20 శాతం కేటాయించి బోధిస్తున్నారు.

Advertisement
Advertisement