కృష్ణపట్నం నుంచి ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్న ఏపీ సర్కారు, తమ వాదనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది.
సుప్రీంలో వాదించనున్న ఏపీ సర్కారు
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం నుంచి ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్న ఏపీ సర్కారు, తమ వాదనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు క్షేత్రస్థాయి నివేదికలపై శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నట్టు తెలిసింది. కృష్ణపట్నం విషయంలో తెలంగాణ వాటా ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. అంతమాత్రాన విద్యుదుత్పత్తిలో భాగం ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. సాంకేతిక కారణాల దృష్ట్యా తమ వాదనే సరైందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే డెవిడెండ్ ఇస్తాం తప్ప, ఉత్పత్తి ఇవ్వబోమని సుప్రీంకు నివేదించే యోచనలో ఉంది. త్వరలో దీని డ్రాఫ్ట్ సిద్ధమవుతుందని విశ్వసనీయంగా తెలిసింది.