యంత్ర విలాపం | తుప్పు పట్టిన ‘యంత్రలక్ష్మి’ పరికరాలు | Sakshi
Sakshi News home page

యంత్ర విలాపం

Sep 28 2013 3:17 AM | Updated on Jun 4 2019 5:04 PM

జిల్లాలో కోట్ల రూపాయలతో ప్రారంభించిన ‘యంత్రలక్ష్మి’ పథకం నిరుపయోగంగా మా రింది. వ్యవసాయంలో యంత్రాల వినియోగ ఆధునిక పద్ధతుల ద్వారా పంటల సాగు ఖర్చు తగ్గిం చి, అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం

సాక్షి, చిత్తూరు: జిల్లాలో కోట్ల రూపాయలతో ప్రారంభించిన ‘యంత్రలక్ష్మి’ పథకం నిరుపయోగంగా మా రింది. వ్యవసాయంలో యంత్రాల వినియోగం,      ఆధునిక పద్ధతుల ద్వారా పంటల సాగు ఖర్చు తగ్గిం చి, అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వివిధ స్కీమ్‌ల కింద కోట్ల రూపాయలతో ట్రాక్టర్లు, రొటావేటర్లు, ఎక్సావేటర్లు, విత్తు నాటే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలను వ్యవసాయశాఖ నిధులతో కొనుగోలు చేసి మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. అనంతరం వీటి నిర్వహణ లేకపోవడంతో యంత్రాలన్నీ తుప్పుపట్టి రైతులకు ఉపయోగపడ్డం లేదు. రెండేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి.
 
2012-2013 ఆర్థికసంవత్సరంలో యంత్రలక్ష్మిలో భాగంగా వ్యసాయ యాంత్రీకరణకు సాధారణ నిధుల కింద రూ.3.62 కోట్లు వస్తే, అందులో 3.59 కోట్లు ఖర్చు చేశారు. ఇదే సంవత్సరంలో రాజీవ్ కృషి వికాస్ యోజన కింద రూ.9.6 కోట్లు వస్తే ఐదు కోట్లు ఖర్చు చేశారు. అదనపు యాంత్రీకరణ కోసం 1.09 కోట్లు మంజూరైతే 1.04 కోట్లు ఖర్చుచేశారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన యంత్రాలను, పరికరాలను మదనపల్లె, పలమనేరు, చిత్తూరు వ్యవసాయ డివిజన్ల పరిధిలోని ఆయా మండల సింగిల్ విండోల ఆధీనంలో ఉంచారు. శ్రీకాళహస్తి, పుత్తూరు వ్యవసాయ డివిజన్లకు మాత్రం యంత్రాలు ఇవ్వలేదు.
 
నిర్వహణ లోపాలు

 సింగిల్ విండోల్లో సభ్యత్వం ఉన్న రైతులు ఈ ట్రాక్టర్లను ఉపయోగించుకుంటే వారి నుంచి గంటకు రూ.500, ప్రైవేటు వ్యక్తుల నుంచి గంటకు రూ.900 తీసుకోవాల్సి ఉంది. సబ్సిడీ ధరతో నడపడం కష్టమౌతోందని సింగిల్‌విండో ఉద్యోగులు వాపోతున్నారు. డ్రైవర్ ఖర్చులు, డీజిల్ ఖర్చులకు ఇది చాలటం లేదంటున్నారు. యంత్రాలు ఇచ్చి వీటి నిర్వహణ, మరమ్మతుల పరిస్థితి వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని సింగిల్‌విండో సీఈవోలు చెబుతున్నారు. తాము యంత్రాలు ఇచ్చామని వాటి నిర్వహణ సింగిల్ విండోలే చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. పట్టించుకునే వారు లేక చాలా చోట్ల మరమ్మతుల కారణంగా యంత్రాలు ఆరు నెలలుగా సింగిల్‌విండో కార్యాలయాల ముందు పడున్నాయి. ఉపయోగించకపోవడంతో ఇవి తుప్పుపడుతున్నాయి.
 
పలు మండలాల్లో..

 పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లె సింగిల్‌విండోకు ప్రభుత్వం సుమారు రూ.5.50 లక్షలతో ట్రాక్టర్, రొటావేటర్, ఆటోమేటిక్ సీడ్ డ్రిల్‌ను ఏడాది క్రితం మంజూరు చే సింది. ఈ ట్రాక్టర్‌ను వ్యవసాయశాఖ, సింగిల్‌విండో సంయుక్తంగా ఉపయోగించాల్సి ఉంది. ఆరునెలల క్రితం రొటావేటర్ గేర్‌బాక్స్ పగిలిపోయింది. ట్రాక్టర్ పంక్చర్. బ్యాటరీ కాలిపోయింది. అప్పటి నుంచీ ఇది మూలన ఉంది. యాదమరిలో సైతం రూ.5 ల క్షలతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ డ్రైవర్‌లేక రెండేళ్లుగా సింగిల్ విండో కార్యాలయం వద్దే ఉంది. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ తుప్పు పడుతోంది. పలమనేరులో రూ.10 లక్షలతో ట్రాక్టర్, కల్టివేటర్, రొటావేటర్లు ఇచ్చారు. ఇవి రెండేళ్లుగా అలంకారప్రాయంగా ఉన్నాయి. బంగారుపాళెం, పుంగనూరు, మదనపల్లె మండలాల్లో సైతం ఇదే పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి యంత్రాల నిర్వహణకు సైతం ఏర్పాట్లు చేసి వ్యవసాయానికి అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.
 
 ట్రాక్టర్ ఉపయోగకరంగా లేదు
 తవణంపల్లె పీఏసీఎస్‌లో ఉన్న ట్రాక్టర్ రైతులకు ఉపయోగకరంగా లేదు. రైతులు బాడుగ ట్రాక్టర్లు, సొంత ట్రాక్టర్లతో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. సింగిల్ విండోవారిని అడిగితే సమాధానం లేదు.
 - మురళీధర్ రెడ్డి, రైతు, ఎగువ తవణంపల్లె
 
 సక్రమంగా నడపడం లేదు

 తవణంపల్లె సొసైటీలో ఉన్న ట్రాక్టర్‌ను సిబ్బంది సక్రమంగా నడపకపోవడంతో రైతులు ప్రైవేటు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌కు ఎప్పుడూ పనులు ఉంటాయి. కానీ సిబ్బంది డ్రైవర్‌ను నియమించక పోవడం వల్ల ట్రాక్టర్ నిరుపయోగంగా ఉంది.
  -సురేష్, రైతు, మిట్టపల్లె
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement