ప్రభుత్వ ఉద్యోగిని హనీట్రాప్‌ చేసిన మహిళ | Woman Honey Traps Government Employee | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగిని హనీట్రాప్‌ చేసిన మహిళ

May 20 2026 9:37 AM | Updated on May 20 2026 11:28 AM

Woman Honey Traps Government Employee

హైదరాబాద్‌: ఓ ప్రభుత్వ ఉద్యోగిని హనీట్రాప్‌ చేసిన మహిళ బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.5.5 లక్షలు వసూలు చేసింది. దీంతో ఆమెను పంజగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలానగర్‌ గాం«దీనగర్‌కు చెందిన సాయికిరణ్‌ (29) ఖైరతాబాద్‌లో పౌరసరఫరాల ఏఎస్‌ఓ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. 2022 జూన్‌లో సైదాబాద్‌కు చెందిన లక్ష్మి (40) అనే మహిళ సాయి కిరణ్‌ వద్దకు వచ్చి రేషన్‌కార్డులో కుమారుడి పేరును చేర్చాలని వచ్చింది. ఆ తరువాత సాయి కిరణ్‌తో మాటలు కలిపి ఫోన్‌ నెంబర్‌ తీసుకుంది.

 ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడంతోపాటు పార్క్‌లు, రెస్టారెంట్లకు వెళ్లారు. ఓయో హోటళ్లకు తీసుకువెళ్లి ఏకాతంగా ఉన్నప్పుడు అతని ఫోటోలు తీసుకుంది. అంతేకాక ఓయో హోటల్‌ రసీదులు తనవద్దే ఉంచుకుంది. అనంతరం ఫోటోలు, హోటల్‌ రసీదులు చూపించి..  బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేసింది. దీంతో బాధితుడు పలుమార్లు డబ్బులు ఫోన్‌పేలో బదిలీచేశాడు. ఆ తరువాత కూడా వేధింపులు ఆపకపోవడంతో 2023లో ఆత్మహత్యకు యత్నంచాడు. తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పాడు. అయితే.. సాయి తల్లికి ఫోన్‌ చేసిన నిందితురాలు రూ.50 వేలు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో అదే రోజు 50వేలు ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు.

సైదాబాద్‌లోని లక్ష్మి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా దుర్భాషలాడింది. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్టేషన్‌ బయటే రూ. 2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. భయంతో ఆమొత్తం కూడా ఇచ్చారు. తిరిగి ఈ నెల 13న పంజగుట్ట సర్కిల్‌ వద్ద మరోమారు డబ్బు డిమాండ్‌ చేసింది. తీవ్ర మనస్థాపానికి గురైన సాయి కిరణ్‌ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం లక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా  బాధితుడు మహిళకు ఎప్పుడెప్పుడు డబ్బు బదిలీ చేశాడు? ఎక్కడెక్కడ వీరు తిరిగారు అనే విషయాలపై విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement