ఊపిరితిత్తులు ఏ కారణం చేతనైన ఇన్ఫెక్షన్కు గురై పనిచేయడం మానిస్తే..రెస్పిరేటరీ ఫెయిల్యూర్" లేదా శ్వాసకోశ వైఫల్యం అంటారు. ఆ పరిస్థితుల్లో రోగి బతికి బట్టకట్టే అవకాశమే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. కానీ ఓ రోగి అంత క్రిటికల్ స్టేజ్లో ఉండగా అత్యాధునిక వైద్య విధానంతో ప్రాణంపోసి సరికొత్త చికిత్సా విధానానికి నాంది పలికారు.
అసలేం జరిగిందంటే..55 ఏళ్ల వైద్యులు తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం బహుళ అవయవాల సమస్యలతో బాధపడుతున్నాడు. అతని ఊపిరితిత్తులు తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడటంతో సెప్టిక్ షాక్కి గురై(శరీరంలో రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోయే ప్రాణాంతక పరిస్థితి) వారాల తరబడి పోరాటం అనంతరం అత్యాధునిక ఆస్పత్రికి హుటాహుటినా తరలించారు.
అక్కడ వైద్యులు రోగిని వెంటిలేటర్, ప్రోన్ వెంటిలేషన్తో సహా అన్ని రక్షణా చర్యలతో చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించినా..అతడి పరిస్థితి మరింత దిగజారడంతో ప్రముఖ రెస్పిరేటరీ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం ఆ వైద్యుడికి ECMO అనే ప్రాణాన్ని నిలబెట్టే చర్యను ప్రారంభించారు.
ECMO అంటే..
ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) అనేది ప్రాణాలను కాపాడే ఒక యాంత్రిక జీవ సహాయక విధానం. ఇది రోగి రక్తాన్ని నిరంతరం శరీరం బయట ఉన్న కృత్రిమ ఊపిరితిత్తులకు పంప్ చేసి, ఆక్సిజన్ను జోడించి, కార్బన్ డయాక్సైడ్ను తొలగించి, తిరిగి రక్తాన్ని పంపుతుంది. ECMO బలహీనపడుతున్న గుండెలకు, ఊపిరితిత్తులకు విశ్రాంతి తీసుకుని, కోలుకోవడానికి సమయం ఇస్తుంది.
అతడిని అనేక వారాల పాటు ICU, CTVS, IDలలో ఉంచి చికిత్స అందించారు. క్రమంగా, అతని ఊపిరితిత్తులు, ఇతర అవయవాల పనితీరు మెరుగుపడింది. ఆ తర్వాత ECMO మద్దతును క్రమంగా తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అతను ఇప్పుడు మునపటిలా యథాస్థితికి వచ్చాడని వెల్లడించారు వైద్యులు.
ఇలా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ బారినపడి ఇతర అవయవాలు పనిచయుండా విశ్రాంతి స్థితికి వచ్చేసినప్పుడు ఈ ECMO ఒక కృత్రిమ గుండె , ఊపిరితిత్తుల మాదిరిగా సహాయక వ్యవస్థగా పనిచేస్తుందని చెబుతున్నారు. తద్వారా రోగి ప్రాణాలను రక్షించగలమని అన్నారు.
(చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!)


