ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హడావిడి ఒక ‘బుడగ’ (బబుల్) లాంటిదేనన్న ఆందోళనలపై అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భిన్నంగా స్పందించారు. ఒకవేళ ఇది బబుల్ అయినప్పటికీ దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఏఐ కంపెనీలు విఫలమైనప్పటికీ ఈ రంగంలోకి వస్తున్న భారీ పెట్టుబడులు శాశ్వత సాంకేతిక ప్రయోజనాలను అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఏఐ రంగంలోకి వస్తున్న మూలధన పెట్టుబడిదారులుగానీ, విధాన రూపకర్తలుగానీ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
పెట్టుబడులు.. ఫలితాలు..
‘ఏఐలో వస్తున్న మార్పులు ఒక బుడగగా మారినప్పటికీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బబుల్ మార్కెట్లో వస్తున్న భారీ పెట్టుబడులు చాలావరకు మెరుగైన ఫలితాలందించేందుకు మళ్లిస్తున్నారు’ అని బెజోస్ పేర్కొన్నారు.
ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం జరుగుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఈ ఏడాది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో మార్కెట్ స్థిరత్వంపై చర్చ నడుస్తోంది.
మార్కెట్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా బలహీనమైన వ్యాపార నమూనాలు ఉన్న స్టార్టప్లు కూడా సులభంగా నిధులను ఆకర్షిస్తున్నాయనే వాస్తవాన్ని బెజోస్ అంగీకరించారు. ‘ఈ తరుణంలో మంచి ఆలోచనలకు, చెడు ఆలోచనలకు మధ్య తేడాను ఎలా గుర్తించాలో పెట్టుబడిదారులు ఇంకా నేర్చుకోలేదు. అది పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే కొన్ని మంచి ఆలోచనలు సాధించే భారీ విజయాలు.. ఓడిపోయిన మిగతా అన్ని సంస్థల నష్టాలను భర్తీ చేస్తాయి’ అని బెజోస్ విశ్లేషించారు.
పారిశ్రామిక చక్రాలు..
పారిశ్రామికంగా ఇలాంటి చక్రాలు(ఇండస్ట్రియల్ సైకిల్స్) చాలా అవసరమన్నారు. ఇవే సాంకేతికతను వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఉదాహరణగా 1990ల నాటి బయోటెక్నాలజీ బూమ్ను ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో మార్కెట్ మితిమీరిన ఉత్సాహం వల్ల కొందరు పెట్టుబడిదారులు ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ కాలంలో కనుగొన్న ఎన్నో మందులు నేటికీ మానవాళికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.
ఇదీ చదవండి: భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు!


