సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రొద్దుటూరులో మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అండ వల్లే ఇలా జరుగుతోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గత ఎన్నికల సందర్భంగా వాడవాడలా ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని రూపుమాపుతామని ఉపన్యాసాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. వీటిలో వేటినీ నియంత్రించకపోగా కొత్తగా క్యాషినో జూదం తోడైంది. గంజాయి ప్రభావం కూడా కనిపిస్తోంది. ఇందుకు ఇటీవల జరిగిన సంఘటనలే కారణం.
టీడీపీలో చేరిన కొందరు బుకీలు
ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన క్రికెట్ బుకీలు రూ.కోట్లకు పడగ ఎత్తారు. డబ్బు ప్రభావంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాప్రతినిధులను సైతం ప్రభావితం చేస్తున్నారు. ఈ కారణంగానే వారిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ప్రధాన బుకీ ఇలియాస్కు సంబంధించిన ఆధారాలు ఇటీవల పోలీసులకు లభ్యమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి వద్ద పోలీసులు ఓ క్రికెట్ బుకీని పట్టుకోగా ఆయన ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె ప్రాంతానికి చెందిన బుకీ పేరు చెప్పారు. ఆయనను పోలీసులు విచారణ చేసి క్రికెట్ పట్టీలను ఎవరికి ఇస్తున్నావని ప్రశ్నించగా.. ఇలియాస్కు ఇస్తున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా స్థానికంగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం వద్దకు వెళ్లి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బు కార్ల వ్యాపారానికి సంబంధించినదని చెప్పి విడిపించుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఇంత వరకు ఇలియాస్ పోలీసులకు దొరకలేదు. ఆయనకు అధికార పార్టీ నేతల అండ ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే మట్టి మసీదు వీధిలో, జిన్నా రోడ్డులో క్రికెట్ బుకీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మట్టి మసీదు వీధికి చెందిన బుకీ కుటుంబ సభ్యులు, జిన్నా రోడ్డుకు చెందిన బుకీ.. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇలాంటి కారణాల వల్లే పోలీసులు బుకీలను కట్టడి చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● పట్టుబడని ప్రధాన బుకీలు ● పోలీసుల తీరుపై విమర్శలు


