పీలేరురూరల్ : పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్ చేసి పది పశువులను గోశాలకు తరలించినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో పీలేరు మండలం తలపుల నుంచి పది పశువులతో రెండు వాహనాలు పుంగనూరుకు వెళుతుండగా స్థానిక క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు ఆపి పరిశీలించారు. అయితే వాహనదారులు పశువుల తరలింపుకు సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడం, తగిన పత్రాలు చూపించకపోకపోవడంతో వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పశువులను చిన్నగొట్టిగల్లు గోశాలకు తరలించారు. పుంగనూరుకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనారోగ్యంతో ఆత్మహత్య
పుంగనూరు : మండలంలోని బండ్లపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు(43) శ్రీనివాసులు కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీనివాసులను కాపాడేందుకు ప్రయత్నించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
ములకలచెరువు : రైలు కింద పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఇందిరా కాలనీకి చెందిన అబ్దుల్(30) బుధవారం రాత్రి నాగర్కోయల్ రైలు కింద పడి మృతిచెందాడు. గమనించిన రైల్వే సిబ్బంది కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ములకలచెరువువాసిగా నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.


