బి.కోడూరు : మద్యంమత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బుధవారం బద్వేలు ద్వితీయశ్రేణి మేజిస్ట్రేట్ 30 రోజుల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. బి.కోడూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన పోతల గురుస్వామి, కాశినాయన మండలం వంకమర్రి గ్రామానికి చెందిన కాకా వెంకటరాముడు అలియాస్ వెంకటరమణ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ వాహనాల తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వీరికి 30 రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ బద్వేలు ద్వితీయశ్రేణి మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.
మాజీ సీఎం ఇంటిపై ఈడీ అక్రమ దాడులు ఆపాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేరళ మాజీ సీఎం పీనరయి విజయన్ ఇంటిపై ఈడీ అక్రమ దాడులను ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని పాత రిమ్స్ వద్దనున్న ఇందిరాగాంధీ సర్కిల్లో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడి దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన జేబు సంస్థగా ఈడీని మార్చుకొని రాజకీయ ప్రత్యర్థులపై, నిష్కారణంగా దాడులు చేపించి, ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు తగవన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
పులిచెర్ల (కల్లూరు) : కల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు..
కల్లూరు –పీలేరు జాతీయ రహదారిలో పెట్రోల్ బంకువద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపేట పంచాయతీ శాంతి నగర్కు చెందిన లక్మ్యయ్య (50)స్వగ్రామం నుంచి పీలేరుకు ద్విచక్రవాహనంలో వెళుతుండగా పీలేరు నుంచి ఎదురుగా వస్తున్న ఈచర్ లారీ వాహనం ఢీకొనడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకొన్న కల్లూరు పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


