కడప అర్బన్: జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు సంక్షేమ ఫార్మసీకి అవసరమైన ఔషధాల సరఫరా కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏజెన్సీలు తమ సీల్డ్ టెండర్ పత్రా లను ఈనెల 27న ఉదయం 10 నుంచి ఈనెల 30న సాయంత్రం 5:00 గంటల వరకు పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో సమర్పించాలని ఎస్పీ సూచించారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలల్లో మంగళవారం నిర్వహించిన సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలలో 266 మంది విద్యార్థులకుగాను 110 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ పది పరీక్షలకు సంబంధించి 332 మందికిగాను 292 మంది హాజరయ్యారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
కడప అగ్రికల్చర్: రోహిణి కార్తి ఆరంభంలో రెండవరోజు మంగళవారం జిల్లాలో ఎండలు అదరగొట్టాయి. జిల్లాలోని ప్రొద్దుటూరులో 44.3 డిగ్రీల, కలసపాడులో 44.2, జమ్మలమడుగులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైయింది. అలాగే పోరుమామిళ్లలో 43.4, రాజంపేటలో 42.6 , బి.కొడూరు, దువ్వూరులో 42.5, చెన్నూరు, సిద్దవటం, ఎర్రగుంట్లలో 42.4, మైదుకూరులలో 42.3, ఖాజీపేటలో 42, వీఎన్పల్లిలో 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కడప అగ్రికల్చర్: కడప నగరంలో మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి వర్షం దంచి కొట్టింది. దాదాపు అరగంట సేపు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మంగళవారం పమగలంతా ఎండతో అల్లాడిపోయిన జనానికి ఈ వర్షం కాసింత ఉపశమనాన్ని కలిగించింది.
జమ్మలమడుగు: మున్సిపల్ కమిషనర్ కర్నాటి వెంకట్రామిరెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. పట్టణంలోని గంగమ్మ దేవాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న రెండు సెంట్ల భూమి వివాదంలో ఉంది. బాధితులు హైకోర్టును ఆశ్రయించి 2022లో స్టేటస్కో ను తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని కోర్టు సూచించింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ ఆ స్టేటస్కోను బ్రేక్ చేస్తూ పనులు ప్రారంభించారని ఫిర్యాదుదారు గంజికుంట నాగరాజు 2025 అక్టోబర్ 10వ తేదీన ఫిర్యాదు చేయడంతో కోర్టు నోటీసు జారీ చేసింది.
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం దేవస్థానంలోని 50 మంది సిబ్బందికి మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి మంగళవారం యూనిఫాంలు పంపిణీ చేశారు. సాధారణ సిబ్బందికి తెల్ల పంచె–షర్టు, పారిశుధ్య కార్మికులకు కాకీ డ్రస్ కేటాయించారు. సిబ్బంది అందరూ తప్పనిసరిగా డ్రస్కోడ్, ఐడీ కార్డులు ధరించి, భక్తులకు సహకరించాలని మఠాధిపతి ఆదేశించారు.
కడప అర్బన్: కడప రిమ్స్ ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2025 సంవత్స రానికి ఆయా ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. డ్యూటీ అటెండర్, జూనియర్ అసిస్టెంట్,ప్లంబర్ తదితర పోస్టులను భర్తీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జమున పత్రాలు అందజేశారు.


