పోరుమామిళ్ల (అట్లూరు) : రిపోర్టర్ను దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడిన పోరుమామిళ్ల సింగిల్ విండో ప్రెసిడెంట్ కల్లూరి వెంకటకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోరుమామిళ్లకు చెందిన దియ్యాల శ్రీనివాసులు ఓ టీవీ రిపోర్టర్గా (సాక్షి కాదు) పనిచేస్తున్నారు. కల్లూరి వెంకటకృష్ణారెడ్డి ఐదు నెలల కిందట శ్రీనివాసులుకు క్యాలెండర్ ప్రకటన ఇచ్చారు. అందుకు సంబంధించిన డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. శ్రీనివాసులు ఈ నెల 23న కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన దుర్భాషలాడుతూ శ్రీనివాసులుపై కర్రతో దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఏపీ మీడియా ఫెడరేషన్ బద్వేలు నియోజకవర్గ అధ్యక్షుడు ఆవుల కిశోర్, ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రఘురాములు, నరసింహ, సురేష్బాబు, అన్నిక కిశోర్, కమల్, భాస్కర్రెడ్డి, శ్రీకాంత్, ప్రసాద్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం పోరుమామిళ్ల ఎస్ఐ పి.హనుమంత్ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


