సాక్షి టాస్క్ఫోర్స్: కడప నగరంలోని ఎన్జీవో కాలనీలో శంకరాపురం పోస్టాఫీసు, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మధ్యలో ఉన్న షాపు రూములను హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు తమకు నచ్చిన వారికి అప్పనంగా అప్పగించేశారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధన మేరకు టెండర్లు నిర్వహించకుండా, వేలం వేయకుండా..రూల్ ఆఫ్రిజర్వేషన్ పాటించకుండా కడప ఎమ్మెల్యే ఆర్. మాధవిరెడ్డి, టీడీపీ రీజనల్ ఇన్చార్జి ఆర్. శ్రీనివాసులరెడ్డి చెప్పారని చెబుతూ మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్, వారి అనుచరులకు అప్పగించినట్లు సమాచారం. టీడీపీలో కొంతమందికి మాత్రమే అన్ని విషయాల్లో ఆర్థికంగా మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సొసైటీలో సభ్యులైన వారికి టెండర్లు లేదా వేలం ద్వారా షాపు రూములు అప్పగిస్తే సొసైటీకీ అదాయం లభించే అవకాశం ఉంది. కానీ సొసైటీలో ఉన్న కీలక సభ్యులు అధికార పార్టీ నేతలతో కుమ్మకై ్క ఇక్కడ ఉన్న ఏడు షాపు రూములను ఒకరికే అప్పగించినట్లు తెలుస్తోంది. ఽఅధికార పార్టీ నేతలు సొసైటీకి నామమాత్రపు లీజు చెల్లించి, వారు మరొకరికి ఎక్కువ ధరకు లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు నిబంధనలను గాలికొదిలేసి అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం ఈ షాపురూముల వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నిబంధనల ప్రకారం షాపులను వేలం ద్వారా కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు హౌస్బిల్టింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకటరెడ్డికి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
కడప ఎమ్మెల్యే పేరు చెప్పి వారి అనుచరులకు అప్పగింత
ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న ఎన్జీఓ కాలనీ హౌస్బిల్డింగ్ సొసైటీ
వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు, ఆరోపణలు


