కడప ఎడ్యుకేషన్ : తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో ఎన్సీసీ క్యాడెట్లు ముందుండాలని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ హరిప్రసాద్ అన్నారు. కడప తెలుగుగంగ కాలనీలో 30 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం విపత్తు నిర్వహణపై ఎన్సీపీ క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి, బాధితులను ఆదుకోవడానికి యువతను సిద్ధం చేయడమే ‘యువ ఆపద మిత్ర’పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఎన్సీసీ క్యాడెట్లు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. 30వ అంధ్రా బెటాలియన్ కమాడింగ్ అధికారి కల్నర్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ శిక్షణలో ప్రథమ చికిత్స, సురక్షిత తరలింపు విధానాలు, విపత్తు సమయంలో కమ్యూనికేషన్, సహాయక చర్యల నిర్వహణపై క్యాడెట్లకు శిక్షణ ఇచ్చిటన్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ లలిత్ బాబు, డాక్టర్ నీలయ్య, క్వార్టర్ మాస్టర్ లెఫ్టినెంట్ నాగశేషాద్రి, ట్రైనింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సెక్యూరిటీ ఆఫీసర్ సురేంద్ర నాయక్, ఎన్సీసీ అధికారులు జయచంద్ర బాబు, చిరంజీవి, శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.


