● అమరావతికి చట్టబద్ధత కూటమి భ్రమే
● రాజధాని డ్రామాలపై మండిపడ్డ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే కోస్తాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజధానికి చట్టబద్ధత అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మించాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 50 వేల ఎకరాలు పంట పొలాలను తీసుకొని ఇంత వరకు వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. మరో 50 వేల ఎకరాల భూమిని తీసుకోనే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 2 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని తెలిపారు. అలా కాకుండా లక్షల ఎకరాల భూములను తీసుకొని ఇష్టమైన కంపెనీలకు ఎకరా రూపాయికి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఆర్డీఏ ఏర్పాటు చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గతంలో హైదరాబాద్ తరహలో జరిగిన తప్పిదాన్ని మరోసారి జరగవద్దని వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచిస్తున్నారని గుర్తుచేశారు. మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం ఉందని, అంతే కాకుండా అన్ని వసతులు, భవనాలు ఉన్నాయని అటువంటి చోట రాజధాని నిర్మాణం చేపడితే ఖర్చు తక్కువతో పూర్తి ఆవుతుందన్నారు. అలా కాకుండా అమరావతిలో నిర్మాంచాలంటే లక్ష కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని, ఎప్పడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. గతంలో శివరామకృష్ణ కమిటీ రాజధాని నిర్మాణానికి అమరావతి సరియైన ప్రదేశం కాదని, అన్ని సంస్థలు ఒకే చోట నిర్మించవద్దని సూచించిందని చెప్పారు. గతంలో విజయవాడలో దిగువ ప్రాంతంలో వరదనీరు వచ్చి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వరదనీరు తొలగించడానికి సుమారు 600 కోట్టు ఖర్చు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమను బుందేల్ఖండ్ తరహలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీని కానీ కూటమి నాయకులు సాధించలేదన్నారు. ఇప్పడు ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మునిసిపల్ విభాగం అధ్యక్షుడు వల్లభాయి హృషికేశవరెడ్డి, మాజీ కౌన్సిలర్ ముల్లా జాని, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ రమణారెడ్డి, ఎర్రగుంట్ల రాజారెడ్డి, సుబ్రమణ్యం, చంద్రశేఖర్రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


