ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ
కడప అగ్రికల్చర్ : కడప నగర శివార్లలోని సింధూర్ ఫంక్షన్ హాల్లో ఇంటర్నల్ రిసోర్సు పర్సన్ ఇస్తున్న శిక్షణలో భాగంగా శనివారం క్షేత్ర స్థాయి శిక్షణకు తీసుకెళ్లారు. వైఎస్సార్ కడప జిల్లా ఇప్పెంట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మెంటార్ ఇంటెన్స్ వెంకటేష్ పొలంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ పంటలు, వివిధ రకాల బయోడైవర్సిటీ క్రాప్స్ చూపించారు. 365 రోజులు పంటలు ఉండేలా సోయింగ్ విధానం, భూమిలో సారవంతం కావడానికి ఘన జీవామృతం, మొక్కలకు పోషకాలు, పెరుగుదల, పురుగులు తెగులు నివారణ, వాటి వల్ల ఉపయోగాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
కొమ్మలూరు ఆలయంలో చోరీ
ఖాజీపేట : మండల పరిధి కొమ్మలూరు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. కొందరు దొంగలు ప్రధాన ద్వారం పగుల కొట్టి ఆలయంలోకి ప్రవేశించి హుండీని అపహరించారు. హుండీని ఆరుబయట పొలంలో పగుల కొట్టి కానుకలను చోరీ చేసి హుండీని పొలంలో పడేసి వెళ్లిపోయారు. అలాగే ఆలయంలోని సుమారు 4 నుంచి 5 కేజీల బరువు గల ఇత్తడి గంటను చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తికి గాయాలు
ముద్దనూరు : స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం రైలు కింద పడి వెంకటరాముడు అనే వ్యక్తి చేయి పూర్తిగా తెగిపోయింది. శ్రీకాళహస్తి గ్రామానికి చెందిన వెంకటరాముడు ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. అతని చేయి కట్ కావడంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో
బాధితులపైనే కేసులు
కడప కార్పొరేషన్ : ‘మోసపోయాం... న్యాయం చేయాలి’ అని కోరిన బాధితులపైనే రివర్స్ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి విమర్శించారు. శనివారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన నాయకులు సాగిస్తున్న అసాంఘిక కార్యకలాపాలు, కామ వికారాలకు అంతూ లేకుండా పోయిందన్నారు. గతంలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి మహిళకు అన్యాయం చేస్తే అతన్ని కంట తుడుపు చర్యగా మాత్రమే సస్పెండ్ చేశారని, అయినా అతను జనసేన తరఫున డిబెట్లు, సమావేశాల్లో పాల్గొంటున్నారన్నారు. కోట వినూత ఏకంగా హత్య చేసి సంచలనం సృష్టించారన్నారు. తాజాగా అరవ శ్రీధర్ వీడియో కాల్స్, న్యూడ్ ఫొటోలతో అడ్డంగా దొరికిపోయిన దృశ్యాలు ప్రజలందరూ చూశారన్నారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన దేవాలయం లాంటి అసెంబ్లీలోనే ఆయన వీడియో కాల్స్ చేస్తూ... అసెంబ్లీ పరువు మర్యాదలను మంటగలిపారన్నారు. ప్రభుత్వ ఉద్యోగినైన తనను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధిస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని బాధితురాలు వీణ ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మొన్న అరవ శ్రీధర్ తల్లి ఫిర్యాదు చేశారని వీణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చూడటం దారుణమన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు ఆధారాలతో సహా బయటపడినా జనసేన పార్టీ ఇంత వరకూ అతన్ని సస్పెండ్ చేయలేదని, తూతూ మంత్రంగా కమిటీ వేసి చేతులు దులుపుకొందన్నారు. మహిళలపై జనసేన పార్టీకి ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టే తెలుస్తుందన్నారు. బాధితురాలు వీణకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆమెకు న్యాయం జరిగే వరకూ ఆమె తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నేతలు తులశమ్మ, నారాయణమ్మ, మల్లీశ్వరి, శివమ్మ పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు మాని..
బాధితురాలు వీణపై కేసుఅన్యాయం
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు
ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ


