మా కుమార్తె ఆచూకీ తెలపండి
ప్రొద్దుటూరు కల్చరల్ : వారం రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమార్తె ఆచూకీ తెలపాలని సీతం పల్లెకు చెందిన కొల్లుబోయిన వీరప్రతాప్, వెంకటలక్షుమ్మ దంపతులు కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ కుమార్తె ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత కనిపించకపోవడంతో అంతా వెతికామన్నారు. తర్వాత రోజు ఉదయం చాపాడు మండలం రామదాసుపల్లెకు చెందిన రాకేష్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలువగా మహిళా పోలీస్ స్టేషన్కు రెఫర్ చేశారన్నారు. వారం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ కుమార్తె బతికుందో లేదో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికై నా పోలీసులు తమ కుమార్తె ఆచూకీ కనుగొనాలని కోరారు.
కడపలో అగ్నిమాపక శాఖ క్రీడలు
కడప అర్బన్ : కడప నగరంలో అగ్నిమాపకశాఖ అధికారుల పర్యవేక్షణలో ఆదివారం క్రీడలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈనెల 30వ తేదీన గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు. అక్కడ ఎంపికై న వారిని రాజస్థాన్లో జరిగే నేషనల్ ఫైర్ సర్వీస్ గేమ్స్కు పంపిస్తామని కర్నూలు రేంజ్ ఆర్ఎఫ్ఓ భూపాల్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ ధర్మారావు, ఏడీఎఫ్ఓ బసివి రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని యువకుడి మృతి
రాజుపాళెం : మండలంలోని అయ్యవారిపల్లె–టంగుటూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వంగల నూర్ బాషా (25) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు టంగుటూరు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన నూర్బాషాను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు.
కబ్జాలను అడ్డుకోండి
సాక్షి టాస్క్ఫోర్స్ : బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1107, 1109లో అగ్రవర్ణాల వారు దళితుల భూములను లాక్కుని కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ గ్రామ దళితులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను దళితవాడ గ్రామస్తులు కోరుతున్నారు. దాదాపు నాలుగు ఎకరాల భూమిలో చదును చేసి బోరు కూడా వేశారు.
మా కుమార్తె ఆచూకీ తెలపండి


