అంగరంగ వైభవం.. పుష్ప రథోత్సవం
● కనుల పండువగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు
● భారీగా పాల్గొన్న భక్తజనం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం పుష్పరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకమాత పుష్పరథంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. జగజ్జననికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి, ఊరేగింపు చేపట్టారు. ఉదయం గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అనుమసముద్రం మండలం కొలను గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న, భువనేశ్వర్రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం అలరించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న కోలాటం
ఇటుకలపాడుకు చెందిన శివపార్వతుల మహిళా కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన గుంటముక్కల వెంకటేశ్వరరావు, వైజాగ్కు చెందిన గోపిశెట్టి సురేంద్రనాథ్, కడపకు చెందిన మునగా బద్రినాథ్ శ్రేష్టి, ప్రకాశం జిల్లా కంభంకు చెందిన తిరువీధి లక్ష్మీరంగయ్యశ్రేష్టి, బ్రహ్మంగారిమఠం ముక్కమల్ల భాస్కర్రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్బాబు, చెరువుపల్లి ఓంకారస్వామి, నొస్సం చంద్రశేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో..
శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకుని తరించారు. అలాగే మాత గోవిందమాంబ, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం, పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, పోలేరమ్మ గుడి, తదితర ప్రాంతాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంగరంగ వైభవం.. పుష్ప రథోత్సవం


