మేయర్ పీఠం ఎప్పటికీ వైఎస్సార్సీపీదే
నూతన మేయర్నుసన్మానించిన నేతలు
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేనని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. గురువారం ఎన్నిక పూర్తయ్యాక కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో సమస్యలు సృష్టించాలని అధికార పార్టీ ప్రయత్నించిందని, తప్పుడు ఫిర్యాదు చేసి అప్పుడు మేయర్గా ఉన్న సురేష్ బాబుపై అనర్హత వేటు వేశారన్నారు. ఈ ఎన్నిక రావడం చాలా బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా ఏకగ్రీవంగా తనను ఎన్నిక చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా వైఎస్సార్సీపీలో చీలిక తేవాలని అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా తామంతా వైఎస్సార్సీపీ వెంటే ఉంటామని కార్పొరేటర్లు మరోసారి నిరూపించారన్నారు. ఇది చాలా శుభపరిణామమన్నారు. మేయర్గా తనకు తక్కువ సమయం ఉన్నా... ప్రజా సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు మాదే:
మాజీ మేయర్ సురేష్ బాబు
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలుపు తమ పార్టీదేనని మాజీ మేయర్ కె. సురేష్ బాబు అన్నారు. ఎన్నిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్గా పాకా సురేష్ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఈ విషయంలో తమ కార్పొరేటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటేశారన్నారు.
పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ
తొలుత వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, మేయర్ అభ్యర్థి పాకా సురేష్ తదితరులు దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం మీదుగా కార్పొరేషన్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు.
● కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు కార్పొరేటర్ల ఐడీ కార్డులు, పాసులు తనిఖీ చేసి లోపలికి పంపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నూతన మేయర్గా ఎన్నికైన పాకా సురేష్ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష ఘనంగా సన్మానించారు. ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
నూతన మేయర్ పాకా సురేష్


