ఆధారాలు చెరిపేశారా?
ప్రేమ..పేదరికం లక్ష్యంగా..
ఎఫ్ఐఆర్లో నిందితులు వీరే
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్లో పూర్తిస్థాయిలో వాస్తవాల గుట్టు రట్టయ్యేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్కొక్కటిగా వివరాలు వెలుగులోకి వస్తుండగా ఇప్పటిదాకా ఎంత మంది కిడ్నీలు తీసి ఎందరికి అమర్చారు, ఇందులో ఏ స్థాయిలో నగదు చేతులు మారింది, ఎవరికి ఎంత వాటాలు చేరాయి, అంతటికీ వైద్యులు, దళారులే సూత్ర, పాత్రధారులా, తెరవెనుక ఇంకా ఎవరెవరున్నారు అన్న ఉత్కంఠ నెలకొనగా, ఈ వాస్తవాల వెల్లడి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దర్యాప్తుపై ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది. మదనపల్లెలో సాధారణ చికిత్సలు, వైద్యం మాత్రమే అందుబాటులో ఉంది. అవయవ మార్పిడికి సంబంధించి అనుమతిలేదు. ఆ స్థాయిలో సౌకర్యాలు, వైద్య నిపుణులు లేనప్పటికీ స్థానిక గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది.
హార్డ్ డిస్కుల్లో ఆధారాలు మాయం?
కిడ్నీ మార్పిడి వ్యవహరంలో కీలకమైన సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని హార్డ్ డిస్క్ల నుంచి తొలగించినట్టు తెలిసింది. గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్పై కేసు నమోదైన తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు ఆస్పత్రిలోని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నా అందులో రికార్డయిన ఫుటేజీని పూర్తిగా తొలగించడాన్ని గుర్తించినట్టు సమాచారం. కేసులో కీలకమైన సాంకేతిక ఆధా రాలు లేకుండా చేస్తే తప్పించుకోవచ్చని ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. యమున కిడ్నీ తొలగింపు ఆపరేషన్ సమయంలో హాస్పిటల్లోకి ఎవరెవరు రాకపోకలు సాగించారు, ఎంత సమయం గడిపారు, యమున హాస్పిటల్లోకి ఎప్పుడు వచ్చింది, వెంట ఉన్నది గుర్తించిన నిందితులేనా ఇంకా ఎవరైనా ఉన్నారా తదితర సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉంది. హార్డ్ డిస్కుల్లో సీసీ కెమెరా ఫుటేజీని రికవరీ కోసం పోలీసులు చర్యలు చేపట్టినట్టు తెలిసింది.
ఆ డాక్టర్ పార్థసారధి ..
గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యుడు రాయలసీమకు చెందిన పార్థసారధిగా గుర్తించిన పోలీసులు ఇతను బెంగళూరులో వైద్యవృత్తిలో స్థిరపడినట్టుగా చెబుతున్నారు. రెండో నిందితుడు అయిన ఇతని పేరు తెలియకపోవడంతో ఎఫ్ఐఆర్లో బెంగళూరుకు చెందిన వైద్యుడిగా నమోదు చేశారు. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే రూ.లక్షల్లో ఫీజు చెల్లించేవారని పోలీసు వర్గాల సమాచారం. డాక్టర్ కోసం బృందాలు గాలిస్తున్నాయి.
ఆ మత్తు డాక్టర్ ఎవరు?
మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడికి అనుమతి లేకపోయినా యమున కిడ్నీ తొలగించి వేరోకరికి అమర్చగా ఆపరేషన్ సమయంలో ఆమెకు మత్తు ఇచ్చిన డాక్టర్ ఎవరో తేలాల్సి ఉంది. ఆ డాక్టర్ తేలితే ఇలా ఎన్ని ఆపరేషన్లకు మత్తు ఇచ్చారో తెలుస్తుంది. ఆపరేషన్లో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది వివరాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి తేవాల్సిఉంది.
ఆ ఇద్దరిది కదిరి..
కిడ్నీమార్పిడి కేసులో మొదటి నిందితుడు డాక్టర్ ఆంజనేయులు స్వస్థలం సత్యసాయిజిల్లా కదిరిలోని సైదాపురంగా తెలిసింది. ఇదేకేసులో నాలుగో నిందితుడు మెహరాజ్ కదిరి ఆస్పత్రిలో డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇద్దరిదీ కదిరి కావడంతో ఇలాంటి కిడ్నీ మార్పిడులకు సంబంధించి లావాదేవి, దాతలు, స్వీకరించిన వారి వివరాలు పూర్తిగా తెలిసే ఉంటాయి. ఈ కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు తెలిసింది.
రూ.లక్షలకు ఒప్పందం..
మృతురాలు సాడి యమున (29) నుంచి కిడ్నీ తీసుకున్నందుకు ఆస్పత్రి వైద్యులతో మధ్యవర్తులు రూ.లక్షల్లో ఒప్పందం చేసుకున్నట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ సొమ్ములో మృతి చెందిన యమునకు, మధ్యవర్తులకు సొమ్ము చెల్లించలేదని చెబుతుండగా దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసుల దృష్టికి వచ్చిన మేరకు చెల్లించాల్సిన ఒప్పందం తక్కువ అని ఇంకా అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. కిడ్నీ స్వీకరించే దాత నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి దాతలకు అతితక్కువ చెల్లిస్తున్నట్టు ఈ ఉదంతం బట్టి తెలుస్తోంది. కాగా మృతురాలు యమునతో సూరిబాబు ఎనిమిదేళ్లుగా సహజీవం చేస్తున్నట్టు నిర్ధారించారు. కిడ్నీమార్పిడి విషయం ఇతనికి తెలియకుండా జరిగే అవకాశం లేదని, ఇతనే మదనపల్లెకు పంపి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
భర్తలు చనిపోయిన వారు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు, అనాథలే లక్ష్యంగా మదనపల్లెలో కిడ్నీ మార్పిడి వ్యవహరం సాగినట్టు కనిపిస్తోంది. మృతురాలు యమున భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందగా, అప్పటినుంచి సూరిబాబుతో సాన్నిహిత్యం పెరిగి సహజీవనం చేస్తున్నారు. సూరిబాబుకు ఈ వ్యవహారంలో సంబంధం లేకపోతే యమున మృతదేహం తిరుపతి తరలించినప్పుడు తల్లి సూరమ్మ ఫోన్లో మాట్లాడిన సమయంలో తాను, పిల్లి పద్మ, సత్యలతో కలిసి లాడ్జిలో ఉన్నామని చెప్పాడంటే వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అమా యకులతో చెలగాటం ఆడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పద్మ, సత్య మధ్యవర్తులుగా పిక్నిక్ పేరుతో మదనపల్లెకు తీసుకొచ్చారు. ఈనెల 9న తేది మధ్యాహ్నం మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ అదేరోజు రాత్రి 2.30 గంటలకు (10వతేది) ఒక కిడ్ని తొలగించి మరొకరికి అమర్చిన తర్వాత యమున మృతి చెందింది.
హాస్పిటల్ హార్డ్ డిస్కుల్లో ఫుటేజీ మాయం
కిడ్నీ అమర్చిన వైద్యుడు పార్థసారధిగా గుర్తింపు
మృతురాలు యమున కిడ్నీకి రూ.లక్షల్లో ఒప్పందం
ప్రస్తుతానికి కేసులో ఏడుగురు, సంఖ్య పెరిగే అవకాశం
జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు
ఏ–1 డాక్టర్ ఆంజనేయులు (డీసీహెచ్ఎస్)
ఏ–2 బెంగళూరుకు చెందిన యూరాలజిస్ట్
ఏ–3 బాలు, టెక్నిషియన్–మదనపల్లె
ఏ–4 మెహరాజ్, టెక్నిషియన్–కదిరి
ఏ–5 పిల్లి పద్మ, మధ్యవర్తి, వైజాగ్
ఏ–6 సత్య, మధ్యవర్తి, వైజాగ్
ఏ–7 సూరిబాబు
ఆధారాలు చెరిపేశారా?
ఆధారాలు చెరిపేశారా?
ఆధారాలు చెరిపేశారా?


