మారిన రైల్వే బుకింగ్!
● 1 నుంచి ఐఆర్సీటీసీ నిబంధనలు
రాజంపేట: రైల్వేబుకింగ్ వ్యవస్థ బుకింగ్ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా టికెట్ బుకింగ్ నియమాల్లో మార్పులు చేసింది. ఈ నెల 1 వ తేదీ నుంచి తెచ్చిన మార్పు సీనియర్ సిటిజన్లకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచుతోంది. అలాగే ముందస్తు రిజర్వేషన్ గడువు విషయంలోనూ కీలక మార్పులు చేసింది.
ముందస్తు రిజర్వేషన్ గడువులో మార్పు
కాగా ముందస్తు రిజర్వేషన్ గడువులో మార్పు తీసుకొచ్చింది. గతంలో రైల్వే టిక్కెట్లను ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునేందుకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాల వ్యవధిని కేవలం 60 రోజులకు తగ్గించారు. ఈ నిర్ణయం టికెట్టు రద్దు సమస్యలను తగ్గించడంతో పాటు బుకింగ్ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరిస్తుంది.
● రైలు ప్రయాణ సమయంలో లోయర్ బెర్తులు కేటాయించాలని సీనియర్ సిటిజన్లు, మహిళలు కోరుతారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ సమయంలో అప్పర్ లేదా మిడిల్ బెర్త్లు కావాలని అడుగుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను మెరుగుపరచింది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనుంది. అయితే ఇది సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుంది. బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోతే తరువాత రైలులో సీటు ఖాళీగా ఉంటే టికెట్టు చెకింగ్ ఇన్స్పెక్టర్ అటువంటి ప్రయాణికులకు దిగువ బెర్త్ను కేటాయించవచ్చు.
లోయర్ బెర్త్ కోసం కొత్త ఆప్షన్: లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకోండి అనే ఆప్షన్ ఎంచుకుంటే రైలులో లోయర్ బెర్త్లు ఉంటేనే టిక్కెట్లు బుక్ చేయవచ్చు. లేకుంటే బుకింగ్ ప్రాసెస్ అవ్వదు. లోయర్ బెర్త్ లేకుండా ప్రయాణించకూడదనుకునే వారికి ఈ కొత్త ఆప్షన్ ఉపయోగపడుతుంది.
రాత్రి, పగలు ప్రయాణంపై నియామలు..
రైలు ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా రైల్వే సంస్థ నిద్రించే, కూర్చునే సమయాలకు సంబంధించి స్పష్టమైన నియమాలను తీసుకొచ్చింది. నిద్ర సమయాలను ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలుగా నిర్ణయించింది.


