కుందూ నదిలో దూకిన వృద్ధ దంపతులు
● వృద్ధుడిని కాపాడిన స్థానికుడు
● వృద్ధురాలి కోసం గాలింపు
రాజుపాళెం : కలకాలం తోడుంటానని పెళ్లిలో మాట ఇచ్చిన ప్రకారం ఇప్పటివరకు ఏ కష్టమొచ్చినా వారు కలిసి ఉన్నారు. చివరకు కలిసే చనిపోవాలని నిర్ణయించుకొని ఇద్దరూ కుందూనదిలో దూకారు. ఈ సంఘటన శనివారం రాజుపాళెం మండలం వెల్లాల సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... పెద్దముడియం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గొంగటి రామ సుబ్బారెడ్డి (81), గొంగటి మునెమ్మ (76) దంపతులు శనివారం ఉదయం రాజుపాళెం మండలం వెల్లాలలోని ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం నది వద్ద ఉన్న గంగమ్మకు పూజలు చేసి ఆ వృద్ధ దంపతులు నదిలోకి దూకారు. అయితే ఈ సంఘటనను చూసి అక్కడే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో వెల్లాలకు చెందిన గుర్రప్ప అలియాస్ (శేషు) ప్రాణాలకు తెగించి వారిని కాపాడేందుకు కుందూ నదిలోకి దూకాడు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డిని ఎలాగోలా కాపాడి ఒడ్డుకు చేర్చగా నాగమునెమ్మ గల్లంతైంది. ఆమె ఆచూకీ కోసం ప్రొద్దుటూరు అగ్నిమాపక సిబ్బంది రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు కుందూనదిలో భారీగా నీటి ప్రవాహం ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది నది వద్దకు బోటును తీసుకొచ్చి గాలింపు చర్యలు చేపట్టాలని చూశారు. ఈ నీటి ఉధృతికి సాధ్యం కాలేదు. తహసీల్దార్ మనోహర రెడ్డి, ఎంపీడీఓ రామనాథరెడ్డి, ఆర్ఐ హుసేన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై గొంగటి రామసుబ్బారెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ నాగకీర్తి తెలిపారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా ఒకరు టెలికాంలో ఉద్యోగం చేస్తుండగా మరొకరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించామని రామసుబ్బారెడ్డి పోలీసులకు తెలిపాడు.
ప్రాణాలకు తెగించి..
కుందూనదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకి వృద్ధ దంపతులను కాపాడిన మొద్దుల గుర్రప్పను అందరూ అభినందించారు. క్షణాల్లోనే సమాచారం తెలుసుకున్న గుర్రప్ప ఈత కాయలు కట్టుకొని కొట్టుకుపోతున్న దంపతులను కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో గుర్రప్పను అధికారులు, గ్రామస్తులు అందరూ శభాష్.. గుర్పప్ప అంటూ అభినందనలతో ముంచెత్తారు.
కుందూ నదిలో దూకిన వృద్ధ దంపతులు
కుందూ నదిలో దూకిన వృద్ధ దంపతులు


