
పోలీసుల సేవలు అజరామరం
జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి
కడప అర్బన్: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారుల, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి కొనియాడారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళి అర్పించారు. కడప నగరంలోని పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వహించిన అమరవీరుల స్మృతి పెరేడ్కు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో పాటు, జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి మాట్లాడుతూ పోలీసు యూనిఫాంకు సమాజంలో అత్యంత గౌరవం ఉందన్నారు. దేశానికి సైనికులు, పోలీసు వ్యవస్థ రెండు కళ్లు వంటివన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రజలు సాధారణంగా ఆర్మీ, పారా మిలిటరీలలో అంతిమ త్యాగం ఉంటుందని అనుకుంటారని, కానీ వాస్తవంగా పోలీసులే ఎక్కువ సంఖ్యలో అమరులవుతారని పేర్కొన్నారు. పండుగల సమయాల్లో అందరు ఇళ్లలో ఉంటే పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటారని, నిరంతరం ప్రజల పరిరక్షణకు అంకితమవుతారన్నారు. ఈ ఏడాది కాలంలో జిల్లాలో 10 మంది సిబ్బంది, ముగ్గురు హోమ్ గార్డులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారు అందించిన సేవలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. భాగంగా జిల్లాలో విధినిర్వహణలో అమరులైన పోలీసు, హోమ్ గార్డుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందచేశారు.
ఛాయా చిత్ర ప్రదర్శన
జిల్లా పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలకు సంబంధించిన ఛాయా చిత్రా లతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి ప్రారంభించగా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఒక్కో ఛాయా చిత్రానికి సంబంధించి వివరాలను విశదీకరించారు.అనంతరం పోలీసులు వినియోగించే ఆయుధాలు, సామగ్రి ప్రదర్శన ’ఓపెన్ హౌస్’ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్క్వాడ్ బృందంలోని డయానా, రూబీ, లూసీ, జిమ్మీ, సోనులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదనపు ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, డీఎస్పీలు, సీఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.