
ఓపెన్ ఇంటర్కు దరఖాస్తులు
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్– 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ సూర్యారావు తెలిపారు. ఓపెన్ ఇంటర్ ద్వారా రెండేళ్ల కోర్సును ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఒక వేళ ఆన్లైన్లో నమోదు చేయలేకపోతే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
21న ఇంటర్వ్యూలు
ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలో గెస్ట్ అధ్యాపకులుగా పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ అర్హత కలిగి ఉర్దూ మాధ్యమంలో బోటనీ, ఫిజిక్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థు లు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హులు ఈనెల 19లోపు దరఖాస్తులను కళాశాల ఆఫీసులో అందజేయాలని తెలిపారు. ఈనెల 21న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
నేడు దర్గా స్వామి జయంతి
రామాపురం (రాయ చోటి జగదాంబసెంటర్): రామాపురం మండలం నీలకంఠ్రావుపేట సమీపంలోని దర్బార్ సాయినగర్లోని సాయి విద్యామందిర్లో ఈ నెల 16న సమర్థ సద్గురు శ్రీశ్రీశ్రీ దర్గా స్వామీజీ 95వ జయంతి వేడుకలు చేపడు తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జయంతి ఉత్సవాలకు భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు తెలియజేశారు.
వెబ్సైట్లో పీఎఫ్ వివరాలు
కడప ఎడ్యుకేషన్: జిల్లా ప్రజా పరిషత్తు యాజమాన్య పరిధిలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది 2023–24వ సంవత్సరానికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు జిల్లా పరిషత్తు డిప్యూటి సీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. వివరాలకు https://www.zppysrkadapa.com/ portal/pf-slips సందర్శించాలని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఒక నెలలోపు రాత పూర్వకంగా కార్యాలయంలో అందజేస్తే పరిష్కరిస్తామని వివరించారు.
చెన్నేపల్లి పాఠశాల సందర్శన
అట్లూరు: అట్లూరు మండల పరిధిలోని చెన్నేపల్లి ప్రాధమిక పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ ఆకస్మిక తనికీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఈఓ పాఠశాలకు వచ్చిన విషయం తెలుసుకున్న చెన్నేపల్లి కాలనీ వాసులు అక్కడకు చేరుకున్నారు. ‘అయ్యా మా పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు తరలించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. అలా జరిగితే మాపిల్లలను మేం పంపియ్యం.. 5వ తరగతి వరకూ మా కాలనీలోనే చదువు చెప్పాలి’ అని విన్నవించారు. స్పందించిన డీఈఓ ఈ విషయం ఇదివరకే తన దృష్టికి వచ్చిందని.. ఈ సమస్య గురించి విద్యాశాఖ జాయింట్ డైరెక్టరుకు పంపించామని.. అక్కడ నుంచి ఉత్తర్వులు అందే వరకూ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగుతుందని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి –1,2 విలియంరాజు, ఖాదర్వల్లి, సీఆర్పీ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
20న జిల్లాస్థాయి హిందీ వ్యాసరచన పోటీలు
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లెలో ఉన్న బీవీఎన్ పాఠశాలలో ఈనెల 20వ తేదీ ఉమ్మడి వైఎస్సార్జిల్లా స్థాయిలో ప్రేమ్చంద్ హిందీ భవన్ సొసైటీ ఆధ్వర్యంలో హిందీ వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ సర్తాజ్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్చంద్ 146వ జయంతిని పురస్కరించుకొని ‘ప్రేమ్చంద్కి జీవని’ అనే అంశంపై పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ప్రేమ్చంద్ జయంతి రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు 6303701314 నంబర్కు ఫోన్ చేసి తమపేర్లను నమోదు చేసుకోవాలన్నారు.