
అవినీతికి కేంద్రం.. కారాగారం
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం అవినీతికి చిరునామాగా మారింది. ఇక్కడ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వివిధ అంశాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది కొందరు అధికారులు, సిబ్బందికి కాసుల పంటగా మారింది. ఎర్రచందనం స్మగ్లర్గా అనేక కేసుల్లో నిందితుడిగా వున్న జాకీర్ పీడీ యాక్ట్ కింద రిమాండ్లో వున్నాడు. అతని వద్దనే ఆకస్మిక తనిఖీల్లో దశల వారీగా 12 సెల్ఫోన్లు, ఛార్జర్ లభించినట్లు విచారణ అధికారిగా వచ్చిన డీఐజీ ఎంఆర్ రవికిరణ్ నిర్ధారణకు వచ్చారు. బాధ్యులైన వారిపై చర్యలకు సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు సిద్ధం చేసి పంపనున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు బయటి నుంచి విసిరేస్తే లోపలికి వచ్చి పడుతున్నాయని, కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది సహకారంతో రిమాండ్ ఖైదీల చేతికి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బయటి నుంచి వచ్చిన సెల్ఫోన్లను కొన్ని సమయాల్లో ఖైదీలే తీసుకుని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. సెల్ఫోన్ల వ్యవహారం తెలిసినా, తాము విధుల్లో వున్నపుడు రిమాండ్ ఖైదీ మాట్లాడుకుంటున్నా తమకేమీ పట్టనట్లు వుండే వారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సెల్ఫోన్ల వ్యవహారంపై ప్రాథమిక విచారణకు వచ్చిన డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమికంగా విచారణకు వచ్చామని, నివేదికను తయారు చేసి డీజీకి సమర్పిస్తామన్నారు. ఈ రిపోర్టు అవినీతి అధికారులకు వ్యతిరేకంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
డెయిరీ పాలు ఏమవుతున్నాయో?
కడప కేంద్ర కారాగారంలోని కీలక అధికారికి సంబంధించిన పెంపుడు కుక్క టామీకి రెండు లేదా మూడు లీటర్ల పాలు పంపించాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఓ హెడ్ వార్డర్ తన పెంపుడు పిల్లికి కూడా పాలు ఇవ్వాలని పట్టుపట్టి మాట్లాడినట్లు సమాచారం. డెయిరీలో వచ్చిన 16 లీటర్ల పాలల్లో 14 లీటర్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం రెండు లీటర్ల పాలల్లో నీళ్లను కలిపి, రిజిస్టర్లో మాత్రం 16 లీటర్ల పాలు లోపలికి పంపిస్తున్నట్లు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్యాకెట్ పాలను నేరుగా వ్యాన్ ద్వారానే లోపలికి పంపిస్తున్నట్లు.. లోపల లెక్క చూసుకుంటున్నారని సమాచారం.
ఖైదీలను ఆస్పత్రులకు తీసుకెళ్తూ..
కొంత మంది జీవిత ఖైదీలు కొందరు అవినీతి అధికారులను ఆశ్రయించి వైద్య పరీక్షలు, చికిత్సలు అంటూ కడప రిమ్స్కు, అక్కడి నుంచి కర్నూలు, విజయవాడ, హైదరాబాద్లకు రెఫర్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతిసారి వేలాది రూపాయలను ముట్టజెపుతున్నట్లు తెలిసింది. డాక్టర్ల రిపోర్ట్ మేరకు కడపకు చెందిన ఓ ప్రముఖ జీవిత ఖైదీకి ప్రతి నెలలో కనీసం రెండు లేదా మూడు సార్లు రిమ్స్కు పంపించి ‘సకల మర్యాదలు’ చేస్తున్నట్లు సమాచారం.
పెట్రోల్ బంకులో చేతివాటం
యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన
ఖైదీ వద్ద సెల్ఫోన్ అభ్యం
నజరానాను బట్టి కొందరికి సౌకర్యాలు
అక్రమాలపై డీఐజీ నివేదిక సిద్ధం
కడప కేంద్రగారం ఆధ్వర్యంలో ఓ పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న జీవిత ఖెదీల్లో కొందరు అక్రమార్జనకు సహకరించి కొందరు కారాగార అధికారులకు రూ.వేల నుంచి లక్షలాది రూపాయలను ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఇక్కడ పని చేస్తున్న కారాగార సిబ్బంది, ఔట్గ్యాంగ్ ఖైదీలను ఎప్పటికప్పుడు విధులను మారుస్తూ, తప్పు జరిగినపుడు సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా వుంది. పెట్రోల్ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వుంది.

అవినీతికి కేంద్రం.. కారాగారం

అవినీతికి కేంద్రం.. కారాగారం