
వైభవం..సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురుపౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, యజ్ఞోపవీతధారణ, మాంగల్యపూజ, కర్పూర హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం సతీసమేతుడైన కోదండరామస్వామికి అర్చకులు పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఆలయ టీటీడీ సూపరిటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
ఉక్కు కర్మాగార నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి
జమ్మలమడుగు రూరల్ : ఉక్కు కర్మాగారం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం జమ్మలమడుగు మండలపరిధిలోని సున్నపురాళ్ల పల్లె వద్ద జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో శిలాఫలకం వేసిన ప్రాంతాన్ని ఎమ్యెల్యే సి.ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇంచార్జ్ భూపెష్రెడ్డి, కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా కర్మాగారానికి కావలసిన స్థలం, మౌళిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారని పేర్కొన్నారు. ఎమ్యెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మమడుగు ప్రాంతంలో కర్మాగారం నిర్మాణం చేపట్టడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జెఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ బేఢీ, జీఎం వికాస్ కన్వర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ పూరి, ప్రాజెక్ట్ హెడ్ నూరుల్, ఆర్డీఓ సాయిశ్రీ పాల్గొన్నారు.
15 నుంచి క్రీడా పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి 17 వరకు ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా మహిళలకు పలు క్రీడలను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి కె, జగన్నాథరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలకు అఽథ్లెటిక్స్, అర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. 22 ఏళ్లలోపు ఉన్న మహిళా క్రీడాకారిణులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
ఎరువుల వాడకంపై అవగాహన అవసరం
కడప ఎడ్యుకేషన్: నేటి ఆధునిక వ్యవసాయసాగులో పంటలకు ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన అవసరమని ఊటకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు సమగ్ర పోషక యాజమాన్యం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయే పంటలకు ఎంత శాతం ఎరువులు అవసరమో ఈ శిక్షణ ద్వారా అందరు తెలుసుకోవాలని వివరించారు. ఏరువాక కేంద్రం అధిపతి బి. పద్మోదయ మాట్లాడారు. కే వి కే శాస్త్రవేత్తలు సాయిమహేశ్వరి, సురేష్ కుమార్రెడ్డి, మానస, గిరీష్ కుమార్ పాల్గొన్నారు
జిల్లా పోలీసుశాఖలో బదిలీలు
కడప అర్బన్: జిల్లా పోలీసుశాఖలో గురువారం భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిల్లో విధులను నిర్వహిస్తున్న 24 మంది ఏఎస్ఐలు, 32 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 109 మంది కానిస్టేబుళ్లను నలుగురు మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 169 మందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు.

వైభవం..సీతారాముల పౌర్ణమి కల్యాణం