
మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల తీరు అమానుషం
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, కో ఆప్షన్ సభ్యురాలు బండి మరియలు, సునీత అన్నారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ నాయకురా లు, మాజీ మంత్రి విడదల రజనిపై సీఐ సుబ్బానాయుడు ఆధ్వర్యంలో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. నాదెండ్ల మండలంలోని ఓ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించారన్నారు. కూటమి ప్రభు త్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నించారు. ఇటీవల కంతేరులో ఎస్సీ మహిళా ఎంపీటీసీని అరెస్ట్ చేశారని, దుస్తులు మార్చుకొని వస్తానన్నా వినిపించుకోకుండా, నైటీలోనే ఆమెను జీపులో ఎక్కించారన్నారు. వాళ్లేమైనా ఉగ్రవాదులా అంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ రెండు ఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, మహిళలపై వేధింపులు, దౌర్జన్యాలు, దాడులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పా మరే పార్టీ ఉండకూడదన్న రీతిలో ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. అరాచకాలు, అక్రమాలు, వేధింపులు కొనసాగిస్తున్న కూటమి నేతలు, సూపర్ సిక్స్ పథకాలు మాత్రం అమలు చేయడం లేదన్నారు. ఒక మాజీ మంత్రికే రక్షణ, భద్రత లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని నిలదీశారు. సీఐ సుబ్బానాయుడు ఖాకీచొక్కా విప్పేసి పచ్చచొక్కా వేసుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి అన్యాయంగా ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలు మల్లీశ్వరి, పద్మ, శ్రీదేవి పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ మహిళా విభాగం
జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ