
ప్రజల్లోకి ప్రజా వ్యతిరేక విధానాలు
వేంపల్లె : ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జగనన్న మిషన్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లెలోని మధురెడ్డి కల్యాణ మండపంలో జగనన్న మిషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలను ఎండగట్టే సమయం దగ్గర పడిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగనన్న ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణ తగ్గలేదన్నారు. అధికారం లేనప్పుడు చంద్రబాబు సమావేశం పెడితే జనాలు రాని పరిస్థితి ఉండేదని, అ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేసుకోవాలన్నారు. జగనన్న ఒక్కసారి ప్రజల్లోకి అడుగు పెడితే చంద్రబాబు గాలికి కొట్టుకొనిపోతాడన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 లాంటి మీడియా, పత్రికలు భజన చేస్తున్నాయన్నారు. జగనన్న మిషన్ సోషల్ మీడియా ప్రతినిధులెవరూ కూడా కేసులకు భయపడవద్దని, వైఎస్సార్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని తెలిపారు. పులివెందులలో సైతం రాజశేఖరరెడ్డి విగ్రహానికి జెండాలు కట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి మాట్లాడుతూ గతంలో 60లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని, ఇప్పుడు సూపర్ సిక్స్ పథకమైన గ్యాస్ సబ్సిడీ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆచూకీ కనపడలేదని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మునీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరి, కో ఆప్షన్ మెంబర్ పత్తి రాజేశ్వరి, ఆలూరు మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ శశికళ, జగనన్న మిషన్ ఫౌండర్ చిన్న సైదులు, జగనన్న మిషన్ డైరెక్టర్ రాఘవ రెడ్డి, విష్ణు, ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, ఈశ్వరరెడ్డి, తుషార్ నాగిరెడ్డి, రోహన్ నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డిలతోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు, జగనన్న సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సతీష్ కుమార్ రెడ్డి