
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
– ఇద్దరికి తీవ్ర గాయాలు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక ముద్దనూరు కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ఉన్న హుస్సేన్ పీరా, హరిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దనూరు రోడ్డులోని జయమ్మ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంలో హుస్సేన్ పీరా, హరిలు వస్తుండగా.. ఆర్టీసీ బస్టాండులోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు సిఫార్సు చేశారు.
రైలు కింద పడి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కమలాపురం రైలు మార్గంలోని గంగాయపల్లె యార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి (50) శనివారం గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తు పట్టిన వారు 94409 00811 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
రిమ్స్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి శనివారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడిని (70) తీసుకుని వచ్చారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు సూచించారు.
అదుపు తప్పి వాహనం బోల్తా
– ఒకరి మృతి
సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్ద శనివారం బొలేరో పికప్ లగేజీ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జింకా చంద్ర(44) అనే వ్యక్తి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. డప ఉక్కాయపల్లె వైఎస్ఆర్ కాలనీకి చెందిన జింకా చంద్ర కూలి పనిచేసుకొని జీవించేవాడు. ఇతనికి బద్వేలులోని శ్రీకృష్ణ దేవరాయ నగర్లో 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారని, స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటుకు శనివారం కడప నుంచి సిమెంటు ప్లేట్లు, స్తంభాలు తీసుకొని కూలీలతో బొలెరో పికప్ లగేజి వాహనంలో బద్వేల్లుకు బయలుదేరాడు. వాహనం సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్దకు రాగానే ఎదురుగా ఎద్దు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జింకా చంద్రకు, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు అబ్దుల్బార్, ఆర్బాజ్, అఫ్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అయితే జింకా చంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.