
బ్యాంకర్లతోనే ఆర్థిక వ్యవస్థ పటిష్టం
కడప అగ్రికల్చర్ : బ్యాంకర్లు సమర్థంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ –2047 దిశగా వైఎస్ఆర్ జిల్లాను కూడా ముందుకు నడిపించాలన్నారు. అందుకుగాను వైఎస్ఆర్ విజన్ యాక్షన్ ప్లాన్ 2024–29 ప్రకారం జిల్లాను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. పొదుపు సంఘాల మహిళలు, రైతులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులకు రుణాలు అందించి, ఆర్థిక చేయూత ఇవ్వాలన్నారు. అనంతరం 2025–26 జిల్లా క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని బ్యాంక్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం, నాబార్డ్ ఏజీఎం విజయ విహారి, రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ రాజేష్ కుమార్, కెనరా బ్యాంకు ఏజీఎం అరుణ జ్యోతి, ఎస్బీఐ ఏజీఎం కృష్ణ కిషోర్, యూబీఐ ఏజీఎం లక్ష్మి తులసి, ఏపీజీబీ ఏజీఎం శ్రీనివాస ప్రసాద్, కేడీసీసీ సీఈఓ రాజమ్మ, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, డీఐఏ జిల్లా కోఆర్డినేటర్ ఎస్వీ రమణ, వివిధ బ్యాంకుల జిల్లా మేనేజర్లు, ఆర్ఎంలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు ఎటువంటి అసౌర్యాలు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య, రవాణా శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆశోక్కుమార్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.