
మద్దుతు ధర.. అరకొర
వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఆశాజనకంగా లేవు. పెరుగుతున్న ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా నిర్ణయించడం లేదు. వివిధ పంటల సాగు, ఉత్పత్తి వ్యయాలకు.. మద్దతు ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఏటా కంటితుడుపుగా నామమాత్రంగా పెంచుతున్నారే తప్ప.. క్షేత్ర స్థాయి పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవటం లేదని రైతులు వాపోతున్నారు.
ఆచరణలో చూపెట్టాలి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కింది స్థాయిలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు దళారులకు అందుతున్నాయి తప్ప సామాన్య రైతులకు అందడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల వల్ల రైతులకు కొంత వరకై నా ఉపశమనం కలగాలంటే కచ్చితంగా అమలు జరగాలి.
– మోహన్రెడ్డి, రైతు, సుంకేసుల
ఖర్చులకు అనుగుణంగా...
ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత తక్కువ మద్దతు ధర పెంచడం ఏమాత్రం లాభం లేదు. అన్ని రకాల ఉత్పత్తుల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలను ప్రకటించాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి,
రాష్ట్ర ఉద్యాన మాజీ సలహాదారు
గిట్టుబాటు అయ్యే విధంగా లేవు
కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అయ్యే విధంగా లేవు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదేళ్ల క్రితమే చెప్పిన కేంద్రం మద్దతు ధరలను అరకొరగానే పెంచుతోంది. మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – పోతిరెడ్డి భాస్కర్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
కడప అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం 2025–26 ఖరీఫ్ సీజన్లోని 14 పంటలకు ఇటీవల మద్దతు ధర ప్రకటించింది. ఇందులో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, నూనెగింజ పంటలైన పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్తోపాటు మిల్లెట్స్ రకాలైన జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, పెసలు, కంది, మినుములకు కనీస మద్దతు ధర పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో విత్తనాలతోపాటు ఎరువులు, కూలీలు ఇలా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పెరిగినఽ ధరలకు అనుగుణంగా పెంచి ఉంటే బాగుండేదని పలువురు రైతులు అంటున్నారు. వైఎస్సార్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే వరి పంటకు గతేడాది కంటే ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే ధర పెంచడంపై అన్నదాతలు అంతగా సంతృప్తి చెందడం లేదు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే కొంత మంది వరి రైతులు ఈ మద్దతు ధరపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏ పంటకు ఎంత మద్దతు ధర
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు సంబంధించి వరి సాధారణ రకం క్వింటాలుకు రూ.2300 ఉండగా 2369కి పెంచారు. అలాగే గ్రేడ్–ఏ రకానికి 2320 ఉండగా 2389, జొన్న (హైబ్రీడ్) రూ.3371 ఉండగా 3699, జొన్న (మాల్థండి) రూ. 3421 ఉండగా 3749, సజ్జలు రూ.2625 ఉండగా 2775, రాగులు రూ.4290 ఉండగా 4866, మొక్కజొన్న రూ.2225 ఉండగా 2400, వేరుశనగ రూ.6783 ఉండగా 7263, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280 ఉండగా 7721, నువ్వులు రూ.9267 ఉండగా 9846, సోయాబీన్ రూ.4892 ఉండగా 5328, పెసలు రూ.8682 ఉండగా 8768, పత్తి (మధ్యరకం) రూ.7121 ఉండగా 7710, పత్తి (లాంగ్ స్టెపెల్) రూ.7521 ఉండగా 8110కి పెంచారు.
పెరుగుతున్న సాగు ఖర్చులు
కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధర ప్రకటిస్తూనే ఉంది. అయితే అనుకున్న మేర మాత్రం పెంచడం లేదని పలువురు రైతులు అంటున్నారు. కంటి తుడుపుగా మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోందని, వీటితో రైతులకు గిట్టుబాటు కావడం లేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. 2018–19 నుంచి ఇప్పటి వరకు ఏటా సగటున వరిధాన్యంపై సరాసరిన రూ.100కు లోపే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు మాత్రం ఏటా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో రూ.13 వందల ఉండే కాంప్లెక్స్ ఎరువుల బస్తా ఇప్పుడు రూ.18 వందలకు చేరింది. డీజిల్ ధర పెరగడంతో ట్రాక్టరు యజమానులు సేద్యం ధరలను పెంచేశారు. కూలీలు, ఎరువులు, పురుగు నివారణ మందులు ఇలా అన్ని రకాల ధరలు భారీగా పెరిగాయి. మొత్తం మీద సాగు ఖర్చులు గతం కంటే 8 వేల నుంచి 10 వేల వరకు పెరిగాయి. కావున సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా మద్దతు ధరను పెంచాలని పలువురు రైతులు, రైతు సంఘ నాయకులు కోరుతున్నారు.
గతేడాది, ఈ ఏడాది పెరిగిన
మద్దతు ధరల వివరాలు
2018 నుంచి వరికి కనీస మద్దతు ధర
వివరాలు ఇలా (క్వింటాలుకు)...
కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు
మద్దతు ధర పెంపు
స్వల్పంగా పెంచడంపై
అన్నదాతల్లో అసంతృప్తి
కంటితుడుపు చర్య అంటున్న
రైతు సంఘాలు
సాగు ఖర్చులకు అనుగుణంగా
ప్రకటించాలని వినతి
పంట 2024–25 2025–26 పెరిగిన
ధర
వరి సాధారణ 2300 2369 69
వరి ఏ గ్రేడ్ 2320 2389 69
జొన్న హైబ్రీడ్ 3371 3699 328
జొన్న (మల్థాని) 3421 3749 328
సజ్జలు 2625 2775 150
రాగులు 4290 4866 576
మొక్కజొన్న 2225 2400 175
కందులు 7550 8000 450
పెసలు 8682 8768 86
వేరుశనగ 6783 7263 480
పొద్దుతిరుగుడు 7280 7721 441
సోయాబీన్ 4892 5328 436
నువ్వులు 9267 9846 579
పత్తి 7121 7710 589
పత్తి 7521 8110 589
(లాంగ్ స్టేపుల్)
సంవత్సరం సాధారణ ఏ గ్రేడు
రకం రకం
2018–19 1750 1777
2019–20 1815 1835
2020–21 1865 1888
2021–22 1940 1960
2022–23 2020 2060
2023–24 2183 2203
2024–25 2300 2320
2025–26 2369 2389

మద్దుతు ధర.. అరకొర

మద్దుతు ధర.. అరకొర

మద్దుతు ధర.. అరకొర

మద్దుతు ధర.. అరకొర