
టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి పులివెందులలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ఆదాయం కోసం ఇసుక, మట్టి, ముగ్గురాయి అనేక వనరులను కొల్లగొడుతున్న టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. అందులో భాగంగా వారం రోజుల క్రితం వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ జెండాలు, తోరణాలను వైఎస్సార్ విగ్రహం వద్ద తొలగించారు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించినందుకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసుల అత్యుత్సాహంతో హత్యాయత్నం కేసు దాదాపు 15మంది వైఎస్సార్సీపీ నాయకుల మీద నమోదు చేసిన విషయం విదితమే. అందులో ఎస్టీ కులానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చలపతిని కూడా కేసులో ఇరికించడంతో అతను పులివెందుల సబ్జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి 12గంటల ప్రాంతంలో నగరిగుట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీను మరికొంతమంది వ్యక్తులతో కలిసి చలపతి ఇంటికి చేరుకుని వారి ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేశారు. ఈ సందర్భంగా చలపతి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. దాడి జరిగిన విషయాన్ని మంగళవారం అర్థరాత్రి చలపతి కుటుంబ సభ్యులు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బుధవారం మధ్యాహ్నం చలపతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే దాడి జరిగిన విషయాన్ని పులివెందుల సీఐకి ఫోన్ చేసి ఇప్పటికే అక్రమ కేసు పెట్టి చలపతిని జైలులో ఉంచారని, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే బాధితుల ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులమీద కేసు నమోదు చేయాలని ఎంపీ గట్టిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, వాటర్ ప్లాంటు వీరారెడ్డి, కోడి రమణ, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
బాధితులను పరామర్శించిన ఎంపీ
కేసు నమోదు చేయాలని డిమాండ్