భారీగా మొబైల్‌ఫోన్లు రికవరీ | - | Sakshi
Sakshi News home page

భారీగా మొబైల్‌ఫోన్లు రికవరీ

Jun 5 2025 8:06 AM | Updated on Jun 5 2025 8:06 AM

భారీగా మొబైల్‌ఫోన్లు రికవరీ

భారీగా మొబైల్‌ఫోన్లు రికవరీ

రాయచోటి : పోలీస్‌ బృందం చేపట్టిన మొబైల్‌ ఫోన్ల రికవరీ సత్ఫలితాలను ఇస్తోంది. అన్నమయ్య జిల్లా పోలీసుల పరిధిలో ఏడో విడతగా 601 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి శభాష్‌ అనిపించుకున్నారు. ఒక కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 601 మొబైల్‌ఫోన్లను రికవరీ చేసి బుధవారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు చేతుల మీదుగా ఫోన్లు పోగొట్టుకున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2024 నవంబర్‌ నుంచి మే నెల 2025 వరకు 1300 మొబైల్‌ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగతనంపై ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందం ద్వారా ఫోన్ల రికవరీ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను వాడుకోవడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లా సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.మహమ్మద్‌అలీ, టెక్నికల్‌ అనాలిసిస్‌ వింగ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.జాన్‌ జోసెఫ్‌ ఆధ్వర్యంలో సైబర్‌ క్రైం సిబ్బంది మొబైల్‌ ఫోన్ల రికవరీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సంయుక్తంగా పనిచేశాయన్నారు. ఇప్పటి వరకు రూ.3.16 కోట్ల విలువ గల 1627 మొబైల్‌ ఫోన్లను 7 విడతలలో రికవరీ చేశామని తెలిపారు. రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్లను బాధితులకు అందజేస్తామని చెప్పారు.

మొబైల్‌ ఫోన్‌ పోతే..

మొబైల్‌ ఫోన్‌ పోతే జిల్లా పోలీస్‌ ఎల్‌ఎంటీఎస్‌ వాట్సాప్‌ నెంబర్‌ 8688830012కు హాయ్‌ అని మెసేజ్‌ చేసిన వెంటనే మీరు ఒక గూగుల్‌ లింక్‌ను రిసీవ్‌ చేసుకుంటారన్నారు. ఆ లింకును క్లిక్‌ చేసి మీ వివరాలు, మీ మొబైల్‌ ఐఎంఈఐ నెంబర్లు మొదలగు వివరాలను తెలియపరుస్తూ ఆ మొబైల్‌ను కొన్న బిల్‌ పేపర్‌ లేదా మొబైల్‌ బాక్స్‌ను మీరు అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలని వివరించారు. లేదా సీఈఐఆర్‌ httpr://w-ww/-c-e-ir.g-o-v.i n/H-o-me/i ndex.jr p లింకును నొక్కడం ద్వారా పోయిన మొబైల్స్‌ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్‌ఐఆర్‌ కట్టకుండా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా సులభతరం చేశామని చెప్పారు.

అపరిచితుల నుంచి ఫోన్లను కొనరాదు..

సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వాహకులు అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయరాదని ఎస్పీ సూచించారు. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్‌ ఫోన్‌ వివరాలు కలిగిన బాక్సు ఉంటేనే కొనుగోలు చేయాలని తెలిపారు.

పక్క రాష్ట్రాల నుంచి..

మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్న, చోరీకి గురైన వాటి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా మొబైల్‌ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.మహమ్మద్‌అలీ, టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.జాన్‌ జోసఫ్‌, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది, మొబైల్‌ రికవరీ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బందికి రివార్డ్స్‌ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు పి.రాజారమేష్‌, కె.రాజారెడ్డి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ తులసీరామ్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు మధు, రాఘవరెడ్డి, మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకరమల్లయ్య, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, పెద్దయ్య, ఇతర పోలీస్‌ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రూ.1.20 కోట్ల విలువ గల

601 మొబైల్‌ఫోన్లు అప్పగింత

7వ విడత మొబైల్‌ ఫోన్ల రికవరీ మేళా

మీడియా సమావేశంలో అన్నమయ్య

జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement